Rohit Sharma : విదేశీ పిచ్ లను, ఆ దేశాల మీడియా పక్షపాత వైఖరిని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ విమర్శించడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అక్కడ మీడియాలు అప్పుడే రోహిత్ శర్మపై విషం కక్కడం మొదలు పెట్టాయి. దీంతో అక్కడి వార్తలను ఎత్తిపోతల పథకంలో భాగంగా మన దేశ జాతీయ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో మళ్లీ మరో సరికొత్త రచ్చ మొదలైంది.
విదేశీ మీడియా రాస్తున్న కథనాల సారాంశం ఏమిటంటే, రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఐసీసీ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని, ఇండియన్ కెప్టెన్ పై చర్యలు తప్పవని రాస్తున్నారు. అంతేకాదు వారే శిక్షలు కూడా ఖరారు చేస్తున్నారు. మ్యాచ్ ఫీజులో కోత కోస్తారని, లేదంటే కొన్ని మ్యాచ్ లపై నిషేధం విధిస్తారని ఇష్టం వచ్చినట్టు రాసి పారేస్తున్నారు.
ఈ విషయంపై మళ్లీ వివాదం రాజుకునేలా ఉంది. భారతదేశంలో క్రికెట్ కి ఆదరణ పెరగడం, బీసీసీఐ అత్యంత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదగడం, ఐపీఎల్ లాంటి లీగ్ మ్యాచ్ లకి విపరీతమైన డిమాండ్ పెరగడం ఇవన్నీ చూసి మిగిలిన దేశాలు ఈర్ష్యతో రగిలిపోతున్నాయి.
ఇంతకుముందు అయితే ఇండియా మ్యాచ్ లు గెలిచినా, సిరీస్ లు గెలిచినా లేదంటే మన క్రికెటర్లకు పేరొచ్చినా వారు రగిలిపోయేవారు. రంధ్రాన్వేషణ చేసేవారు. ఇవిగో రోహిత్ శర్మ చెప్పినట్టు ఇండియా పిచ్ లన్నీ నాసిరకం అని, తమ జట్టుకి అనుకూలంగా తయారు చేసుకుంటున్నాయని కూసేవారు.
ఆ పిచ్ బాగా లేకపోవడం వల్లే ఓడిపోయారు…లేదంటే తమ ప్లేయర్లు చాలా గొప్పవాళ్లని రాసుకొచ్చేవారు. చివరికి ఇండియా సాధించిన విజయాలని తక్కువ చేసి చూసేవారు. ఇది ఇప్పటి సమస్యకాదు. అందుకే సునీల్ గవాస్కర్ లాంటి సీనియర్ కూడా స్పందించాడు. మా రోజుల నుంచి ఇదే సమస్య ఉంది. ఇది నేడు వేళ్లూనుకుపోయింది. రోహిత్ శర్మ ఒక్కడూ దీనిని పెకిలించలేడని అన్నాడు.
ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే, సౌతాఫ్రికాలో రెండో టెస్ట్ మ్యాచ్ పిచ్ ఎలా స్పందించిందో అందరూ చూశారు. చాలా ప్రమాదకరమైన పిచ్ మీద ఆడాం. ఏ మాత్రం తేడా వచ్చినా ముఖాలు పగిలిపోయేవి. కానీ వీటి గురించి ఎవరూ మాట్లాడరు.
ఇలాంటి పిచ్ ఇండియాలో ఉంటే మాత్రం, ఈ పాటికి నోరిచ్చుకుని పడిపోయేవారు. అందుకే వారు నోరు మూసుకుంటే, మేం కూడా మాట్లాడం, వారు నోరు తెరిస్తే, మేం కూడా ఇలాగే సమాధానం చెబుతామని అన్నాడు.
మేం ఇక్కడికి వచ్చి ప్రమాదకరమైన పిచ్ మీద ఆడినట్టే, భారత్ లో స్పిన్ పిచ్ లపై ఎందుకు విదేశీ ఆటగాళ్లు ఆడలేరని అన్నాడు. అందరం ఆటగాళ్లమే. అందరినీ ఒకలాగే చూడాలని కోరాడు.
ఇప్పుడు విదేశీ మీడియా కథనాలపై కొందరు కామెంట్ చేస్తున్నారు. బీసీసీఐ లాంటి బలమైన క్రికెట్ శక్తి ముందు ఐసీసీ కూడా ఏమీ చేయలేదు. రోహిత్ శర్మకి వచ్చిన నష్టమేమీ లేదు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపమని సూచిస్తున్నారు.