AP Politics : ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా అరాచకాలు జరుగుతున్నాయని.. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో తిరుగుబాటు చూసే నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల విధులకు అనుభవం ఉన్నవారిని నియమించాలని ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు.
ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని సీఈసీ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ఎన్నికల కమిషన్కు అన్ని అంశాలు వివరించారని ఆయన పేర్కొన్నారు. చంద్రగిరిలో దాదాపు లక్ష పైచిలుకు దొంగ ఓట్లు నమోదయ్యాయని.. చర్యలు తీసుకొని వెంటనే తొలగించాలని సీఈసీని కోరారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజల పర్యటనలో భాగంగా ఇవాళ విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన బృందం సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల తుది జాబితా, ఎన్నికల సంసిద్ధతపై సీఈసీ రాజీవ్కుమార్ వివిధ రాజకీయ పార్టీలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఇక వైసీపీ తరఫున ఎంపీ విజయసాయి రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, ఆప్ నేతలు హాజరయ్యారు.