Karnataka : జన్మనిచ్చిన తల్లి తన పిల్లలను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది. తనకు ఏం జరిగిన తన బిడ్డ క్షేమమే కోరుకుంటుంది. అలాంటి మాతృమూర్తులకు ఓ మహిళ మాయని మచ్చ తెచ్చింది. తన నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టింది. ఆ బ్యాగుతోనే ట్యాక్సీలో గోవా నుంచి కర్ణాటక వరకు ప్రయాణించింది.
కర్ణాటక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సుచనా సేత్ అనే మహిళ ఓ స్టార్టప్ని స్థాపించింది. ఆ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తోంది. శనివారం ఆమె తన నాలుగేళ్ల కుమారుడితో ఉత్తర గోవాలోని ఒక హోటల్కు వెళ్లింది. సోమవారం ఉదయం హోటల్ గదిని ఖాళీ చేసి ట్యాక్సీలో కర్ణాటకకు బయలుదేరింది. శుభ్రం చేసేందుకు హోటల్ సిబ్బంది ఆ గదికి వెళ్లారు. అక్కడ రక్తపు మరకలను గుర్తించారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు.
హోటల్లో దిగినప్పుడు కుమారుడితో కలిసి కనిపించిన ఆమె.. వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులు ఆమె వెళ్లిన ట్యాక్సీ డ్రైవర్కు ఫోన్ చేసి సుచనాతో మాట్లాడారు. కుమారుడిని తన ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలినట్లు ఆమె చెప్పింది. ఆమె ఇచ్చిన ఫ్రెండ్ అడ్రస్ నకిలీదని తేలడంతో పోలీసులకు అనుమానం బలపడింది. వెంటనే కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అదే సమయంలో పోలీసులు ట్యాక్సీ డ్రైవర్ను సంప్రదించి అనుమానం రాకుండా ఆమెను సమీపంలోని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లాలని సూచించారు. చివరకు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సుచనా బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.