TS Weather: తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. ఉత్తరాది జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం 10 గంటలైనా.. చలితీవ్రత తగ్గడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ వాసులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ఉత్తర భారతం నుంచి తెలంగాణ మీదుగా వీస్తోన్న గాలుల కారణంగా చలిగాలులు పెరిగాయని అధికారులు వెల్లడించారు. పగటిపూట ఎండ ఉన్నా.. రాత్రిపూట చలిఎక్కువగానే ఉంటుందని, రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని తెలిపారు.
మంగళవారం ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు స్వల్పంగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో మంగళ, బుధవారాలు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే కొన్ని జిల్లాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రం భీమ్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఉదయం వేళలో పొగమంచు అధికంగా ఉండొచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోనూ స్వల్పంగా పొగమంచు ఉంటుందని పేర్కొన్నారు.