Deepti Sharma : ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ 20 సిరీస్ ఇప్పటికే 1-1తో సమమైంది. టీమ్ ఇండియా అమ్మాయిలు టెస్ట్ మ్యాచ్ గెలిచారు. వన్డే సిరీస్ పోగొట్టారు. ఇప్పుడు టీ 20లో నిర్ణయాత్మకమైన మూడోది జనవరి 9న జరగనుంది. ఇప్పుడిది గెలుస్తారా? లేదా? అనేది అందరి మదిలో ప్రశ్నగా ఉంది.
మొదటి టీ 20లో ఒక వికెట్ నష్టానికే 145 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా అలవోకగా చేధించింది. రెండో మ్యాచ్ కి వచ్చేసరికి మొత్తం టీమ్ అంతా కలిసి 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదటి మ్యాచ్ లో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన షెఫాలీ వర్మ రెండో టీ 20లో 1 పరుగుకే అవుట్ అయ్యింది.
ఇక స్మృతి మంధాన 23, దీప్తి శర్మ 30, రిచా ఘోష్ 23, జెమీమా రోడ్రిగ్స్ 13, వీరే రెండంకెల స్కోర్ చేశారు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
ఇకపోతే ఓటమిలో కూడా ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే, భారత ఆల్ రౌండర్ దీప్తిశర్మ అరుదైన రికార్డ్ సాధించింది. టీ 20 ఫార్మాట్ లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డ్ సృష్టించింది. ఈ ఘనతను తనతోపాటు మరో ముగ్గురు మహిళా క్రికెటర్లు సాధించారు.
పాకిస్తాన్ కి చెందిన నిదా దార్: 1839 పరుగులు, 130 వికెట్లు
ఆస్ట్రేలియాకి చెందిన ఎల్లిస్ పెర్రీ: 1750 పరుగులు, 123 వికెట్లు
న్యూజిలాండ్ కి చెందిన సోఫీ డివైన్ : 3107 పరుగులు, 113 వికెట్లు
వీరందరూ టీ 20లో అరుదైన డబుల్ ఫీట్ సాధించారు.
ఇప్పుడు వీరందరి సరసన భారత అమ్మాయి దీప్తీశర్మ చేరింది. రెండో టీ 20 మ్యాచ్ పోయినా సరే, తను రికార్డ్ సాధించడంతో అభిమానులు గుడ్డిలో మెల్ల అనుకుంటూ సంతృప్తి చెందారు.