Rangareddy Crime: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో పట్టపగలే యువతిని హతమార్చి.. మృతదేహాన్ని గుర్తించకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానిక రైతులు కొందరు రోడ్డు పక్కన కాలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకునే సరికి ఇంకా మృతదేహాం కాలుతూనే ఉండగా.. రైతుల సహాయంతో మంటలు ఆర్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప్టటిన పోలీసులు యువతిని వేరే చోట హత్య చేసినట్టు గుర్తించారు. 80 శాతం మృతదేహం కాలిపోగా.. ఆమె వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. వివాహమైనట్లు గుర్తులేవీ కనిపించకపోవడంతో యువతికి ఇంకా పెళ్లి కాలేదన్న నిర్ధారణకు వచ్చారు. దుండగులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.
మొయినాబాద్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యువతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు.. హత్యకు కారకులైన దుండుగలను పట్టుకునే పనిలో పడ్డారు. ఇందుకుగాను మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఎస్ బీ బృందాలను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను క్లూస్ టీం పరిశీలించింది. అలాగే ఘటనా స్థలంంలో దొరికిన సగం కాలిపోయిన మొబైల్ దొరకడంతో.. సెల్ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. మరోపక్క ఈ యువతిపై ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదు అయిందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.