RangaReddy : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో జరిగింది. స్థానిక సీఐ ప్రతాప్ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. జి సుగుణ అనే మహిళ కొడుకుతో కలిసి కేశంపేట రోడ్డులో గల ఇంట్లో జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో తాగుడుకు బానిస అయింది. కొడుకుతో గొడవపడి మరీ డబ్బులు తీసుకుని మద్యం సేవిస్తుండేది.
ఈ క్రమంలో 20 రూపాయల కోసం కొడుకుతో గొడవపడింది. అతను చేయి చేసుకోవడంతో ఆమె కింద పడిపోయింది. స్థానికులు వారి మధ్య గొడవను ఆపారు. కూతురు కూడా వచ్చి మందలించి వెళ్లిపోయింది. ఆమె మరుసటి రోజు కూడా అదే విధంగా తాగి వచ్చి ఇంటిముందు కింద పడిపోగా స్థానికులు ఆమెను ఇంట్లో పడుకోబెట్టారు. కొడుకు తల్లిని నిద్రలేపడానికి ప్రయత్నించగా తను స్పందించకపోవడంతో స్థానికుల సహకారంతో చూడగా ఆమె అప్పటికే చనిపోయిందని గుర్తించారు. మహిళ మరణానికి గల కారణాలను పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత వెల్లడిస్తామని సీఐ తెలిపారు.