CM Revanth Reddy: పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షునిగానూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. ఓవైపు ప్రజాపాలన అందిస్తునే.. మరోవైపు పార్టీని మరింత బలంగా పటిష్టపరిచేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. అందులో భాగంగానే సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. సోమవారం జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశమయ్యారు.
ఇక ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోతొలి సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్తో ఇంద్రవెల్లి సభతో పార్లమెంట్ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదిలాబాద్ నేతలకు సూచించారు.
జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. వారంలో రెండు మూడు రోజులైనా రోజుకు మూడుగంటల పాటు ఎమ్మెల్యేలను కలవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇంచార్జ్ మినిస్టర్లు.. గెలిచిన, ఓడిన ఎమ్మెల్యేలను కలుపుకుని వెళ్లాలని సూచించారు. టార్గెట్ 14 పెట్టుకుంటేనే కనీసం 12 స్థానాల్లో గెలుస్తామని.. ఆ దిశగా వర్కవుట్ చేయాలని క్లియర్కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.
.
.