AP Anganwadi Protest: ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు పట్టువదలకుండా పోరాడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా, హెచ్చరికలు పంపినా.. తగ్గేదేలే అంటున్నారు. సమ్మె ప్రారంభించి 28 రోజులు పూర్తైంది. అయినా పోరాటంలో ఏమాత్రం సీరియనెస్ తగ్గకుండా కొనసాగిస్తున్నారు. సర్కారు భయపెట్టేందుకు ప్రయత్నించినా.. వెనక్కి తగ్గలేదు. ఎస్మా ప్రయోగించినా తలొగ్గలేదు. చివరకు విధుల్లో చేరేందుకు ప్రభుత్వం డెడ్లైన్ విధించినా కూసింత కూడా జంకలేదు. ఎవరేం చేస్తారో తాము చూస్తామంటూ నిరసన కొనసాగిస్తున్నారు. అధికారుల ఒత్తిడితో కొన్నిచోట్ల అతికొద్దిమంది మాత్రమే విధుల్లో చేరారు. అత్యధిక శాతం మంది ఆందోళనలోనే కూర్చున్నారు.
సమ్మెలు, ఆందోళనలతో విజయవాడ ధర్నా చౌక్ హోరెత్తిపోతోంది. దీంతో విజయవాడ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలను అడ్డుకుంటున్నారు. ఎస్మా ప్రయోగించినా తగ్గమంటూ సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు అంటున్నారు. వేతనాలపెంపు, ఉద్యోగ భద్రతపై ఆందోళన విరమించేది లేదని మున్సిపల్ కార్మికులు చెబుతున్నారు. మరోవైపు అంగన్వాడీల సమస్యలపై 36 గంటల దీక్షకు యూటీఎఫ్ పిలుపిచ్చింది. పోలీసులు అనుమతి నిరాకరించినా.. దీక్ష చేస్తామంటూ యూటీఎఫ్ నేతలు భీష్మించారు. ధర్నా చౌక్లో ఉన్న అందోళనకారుల టెంట్లు తీసేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.
అంగన్వాడీలు ఇంత పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం దూకుడు చర్యలతో ముందుకు పోతోంది. డూ ఆర్ డై అనే రీతిలో వ్యవహరిస్తోంది. అంగన్వాడీలు సమ్మె విరమించకపోవడంతో.. ప్రభుత్వానికి సలహాలిచ్చే సజ్జల ఘాటుగా స్పందించారు. మున్సిపల్, అంగన్వాడీ కార్మికులు సమ్మె విరమించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం తీసుకునే చర్యలకు వారే బాధ్యత వహిస్తారని తేల్చి చెప్పేశారు. నిజానికి అంగన్వాడీలకు నిన్న సాయంత్రం 5 గంటల వరకే గడువు ఇచ్చింది. కానీ నిరసనకు ముగింపు పలకలేదు. ఈ క్రమంలో టెంట్లు తీసేస్తామంటూ పోలీసులు వారికి వార్నింగ్ సైతం ఇచ్చారు. ఒకవేళ టెంట్లు తీసేయని పక్షంలో తామే తీసేస్తామని హెచ్చరిస్తున్నారు.
.
.