1969 Telangana Movement : 1956 నవంబరు 1న, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలు, రక్షణలను పూర్తిగా విస్మరించటంతో తెలంగాణలో మొదలైన అసంతృప్తి.. క్రమంగా తొలి తెలంగాణ పోరాటంగా మారింది. ఖమ్మం జిల్లాలో మొదలైన ఈ ఉద్యమం తెలంగాణ అంతా వ్యాపించి, తమ హక్కుల సాధనకు మాధ్యమంగా నిలవటమే గాక మలిదశ తెలంగాణ పోరాటానికి ప్రాతిపదిక అయింది. ఈ ఉద్యమం ప్రారంభమై 55 ఏళ్లైన సందర్భంగా నాటి ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలను తెలుసుకుందాం.
1969 జనవరి 5 : పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పాల్వంచలోని థర్మల్ పవర్ ప్లాంట్లో ఆంధ్రోళ్లకే ఎక్కువ ఉద్యోగాలిచ్చారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగుల నిరసన.
జనవరి 9 : తాను ముల్కీ అయినా.. తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ బీఏ స్టూడెంట్, విద్యార్థి నేత రవీంద్రనాథ్.. ఖమ్మం గాంధీచౌక్ దగ్గర దీక్షకు దిగగా, నాటి ఖమ్మం మున్సిపాలిటీ నాటి ఉపాధ్యక్షుడు, కవి.. శ్రీర కవి రాజమూర్తి కూడా పాల్గొన్నారు. వివిధ డిమాండ్లతో తెలంగాణ రక్షణ సమితి ఏర్పాటు.
జనవరి 10 : విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగటంతో నిజామాబాద్, ఉస్మానియా యూనివర్సిటీకి పాకిన ఉద్యమ నిరసనలు.
జనవరి 13 : ఓయూలో ‘తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి’ ఏర్పాటు. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా విద్యార్థుల తీర్మానం. అదే రోజు పలువురు ప్రముఖులు కలిసి ‘తెలంగాణ పరిరక్షణ కమిటీ’ని ఏర్పాటు చేశారు.
జనవరి 20 : శంషాబాద్లో ఉద్యమంలో పాల్గొన్న స్కూలు విద్యార్థులపై కాల్పులు.
జనవరి 24 : ఉద్యమంలో పొల్గొన్న విద్యార్థులపై సదాశివపేటలో పోలీసుల కాల్పులు. కాల్పుల్లో 14 మందికి గాయాలు. చికిత్స పొందుతూ 17 ఏళ్ల భీమన్పల్లి శంకర్ అనే విద్యార్థి మృతి. తెలంగాణ కోసం ప్రాణం కోల్పోయిన అమరుడిగా గుర్తింపు.
జనవరి 27 : నల్లగొండలో రంగాచార్యులు అనే ఆంధ్రా ఉద్యోగిపై కొందరు పెట్రోల్ పోసి, అంటించి హత్య చేశారు. దీంతో సీమాంధ్రలో జీవో 36 వెనక్కి తీసుకోవాలనే ఆందోళనలు ప్రారంభం
ఫిబ్రవరి 28 : యువకులు, మేధావులు కలిసి హైదరాబాద్లో ‘తెలంగాణ ప్రజా సమితి’ని ఏర్పాటు
మార్చి 29 : నాన్ ముల్కీలను వెనక్కి పంపటం సరికాదని సుప్రీంకోర్టు తీర్పు విడుదల, తీర్పును ఖండిస్తూ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా, తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేసి.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు
ఏప్రిల్ 12 : ఉద్యమకారులను శాంతింపజేసేందుు 8 పాయింట్ ఫార్ములాను ప్రతిపాదించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ
1969 మే 20 : ఉస్మానియా వర్సిటీలో వీసీ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్లో తొలిసారి ప్రొ. జయశంకర్ నాగార్జున సాగర్ నీటి పంపకంపై తన పరిశోధన ప్రతిని సమర్పించారు.
జూన్: ఈ నెల అంతా ప్రత్యేక తెలంగాణ కోసం సమ్మెలు, బంద్లు జరిగాయి.
1969 జూన్ 6 : కాళోజీ అధ్యక్షతన తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు
జూన్ 10 : తెలంగాణ ప్రాంత ఉద్యోగులంతా సమ్మెకు పిలుపునిచ్చారు. 36 రోజుల పాటు సాగిన సమ్మె
జూన్ 24 : ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా వచ్చి, నేతలందరితో చర్చలు జరిపారు.
జూన్ 25 : హైదరాబాద్లో ఉద్యోగుల సమ్మె.
జూన్ 27 : అప్పటి సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి రాజీనామా.
ఆగస్టు 18 : లోక్సభలో తెలంగాణ ప్రాంత ఎంపీలు కాకా జి. వెంకటస్వామి, జి.ఎస్. మేల్కోటే ప్రత్యేక తెలంగాణ నినాదాలు
సెప్టెంబర్ 25 : టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్రపతిని కలిసిన కొండా లక్ష్మణ్ బాపూజీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై వినతి
నవంబర్26 : ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్టు మర్రి చెన్నారెడ్డి ప్రకటన.
1970 డిసెంబర్10 : ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవేనంటూ ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పు.
1973 సెప్టెంబర్ 21: తెలంగాణ, ఏపీ ప్రాంతాల నేతల మధ్య ఆరు పాయింట్ల ఫార్ములాపై ఒప్పందం.
1985 డిసెంబర్ 30 : జోన్ల వారీగా ఉద్యోగులను కేటాయించేందుకు జీవో 610 విడుదల