Pravasi Bharatiya Divas : నేడు జనవరి 9. సరిగ్గా 109 సంవత్సరాల క్రితం (1915)లో ఇదే రోజు దక్షిణాఫ్రికాలో వకీలుగా పనిచేస్తున్న మహాత్మాగాంధీ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో తనవంతు సేవలందించేందుకు భారత్ తిరిగొచ్చిన రోజు. చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ రోజును ఇకపై ‘ప్రవాసీ భారతీయ దివస్’గా జరుపుకోనున్నట్లు 2003లో నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయ దివస్ సందర్భంగా విదేశాల్లోని మన ప్రవాసీయులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం.
మన ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఉన్న భారతీయుల సంఖ్య 3.2 కోట్లు. వీరిలో ఆయా దేశాల పౌరసత్వం ఉన్నవారి సంఖ్య 1.8 కోట్లు కాగా, నేటికీ భారత పౌరసత్వాన్నే కొనసాగిస్తున్న వారి సంఖ్య 1.4 కోట్లు. వీరిలో గల్ఫ్ కూటమిలోని 6 దేశాలలోనే 90 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ కూటమిలోని దేశాలైన.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 35 లక్షలు, సౌదీ అరేబియాలో 25 లక్షలు, కువైట్లో 10 లక్షలు, ఖతార్లో 7.5 లక్షలు, ఒమన్లో 7.8లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో 27లక్షల మంది, ఆస్ట్రేలియాలో 7.83లక్షల మంది ఉండగా, విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య 12లక్షల వరకు ఉంటుంది.
ఇక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు బహుళజాతి కంపెనీలకు పలువురు భారతీయులు నేతృత్వం వహిస్తున్నారు. వీరిలో సత్య నాదెళ్ల(మైక్రోసాఫ్ట్), సుందర్ పిచాయ్ (గూగుల్), అరవింద కృష్ణ(ఐబీఎం), శంతను నారాయణ్(అడోబ్), పునీత్ రంజన్ (డెలాయిట్), లీనా నాయర్(షనెల్), గుంజన్ షా(బాటా) వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు.
ఏనాడో ఆ దేశాలకు వెళ్లి, అక్కడే స్థిరపడి, తమ తమ వృత్తుల్లో రాణించి, అక్కడి ఎన్నికల్లో పోటీచేసి కీలక పదవులను అధిష్టించిన భారతీయుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కమలా హ్యారిస్ (అమెరికా ఉపాధ్యక్షురాలు), రిషి సునాక్ (బ్రిటన్ ప్రధాని), హాలిమా యాకబ్ (సింగపూర్ ప్రెసిడెంట్), మహమ్మద్ ఇర్ఫాన్ (గయానా ప్రెసిడెంట్), చంద్రికా ప్రసాద్ సంతోఖి (సురినామ్ అధ్యక్షుడు), ఆంటోనియో కోస్టా (పోర్చుగల్ ప్రధాన మంత్రి), లియో వరాద్కర్ (ఐర్లాండ్ ప్రధాని), పృథ్వీరాజ్సింగ్ రూపన్ (మారిషస్ ప్రెసిడెంట్), ప్రవీంద్ జగన్నాథ్ (మారిషస్ ప్రధాన మంత్రి) వంటివారు ఈ జాబితాలో ఉన్నారు. ఇక.. అమెరికాలో సుమారు 130 మంది భారతీయులు.. నేటి జోబైడెన్ సర్కారులో కీలక స్థానాల్లో ఉండగా, మరికొందరు బ్రిటన్ పార్లమెంటులోనూ ఎంపీలుగా ఉన్నారు.
ఇక.. విదేశాల్లో పనిచేస్తూ, ఇంటికి డబ్బు పంపే విషయంలో భారతీయులే ముందంజలో ఉన్నారు. ఆయా దేశాలకు చేరే మొత్తం డబ్బులో 66 శాతం ఒక్క భారతదేశానికే చేరుతోంది. ఈ జాబితాలో మెక్సికో(6700 కోట్ల డాలర్లు), చైనా (5 వేల కోట్ల డాలర్లు), పాకిస్థాన్ (2400 కోట్ల డాలర్లు), బంగ్లాదేశ్ (2300 కోట్ల డాలర్లు) మన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ చేరే మారక ద్రవ్యంలో 28% గల్ఫ్ నుంచి, 23% అమెరికా నుంచి వస్తుండగా, సింగపూర్, బ్రిటన్ నుంచి 13% మారకద్రవ్యం మన దేశంలోకి వస్తోంది.
వలస జనాభా గణాంకాల్లోనూ భారతీయులే ముందంజలో ఉన్నారు. మొత్తం 3.2 కోట్ల మంది భారతీయులు దేశం వెలుపల నివసిస్తుండగా, ఈ విషయంలో మన తర్వాత వరుసగా మెక్సికో (1.1కోట్లు), రష్యా (1.1కోట్లు), చైనా (కోటి), సిరియా (80లక్షలు) దేశాలున్నాయి. భారతీయుల్లో అత్యధికులు నివసిస్తున్న దేశం అమెరికా(48 లక్షలు) కాగా వారిలో 13 లక్షల మంది ప్రవాసులు, 31.8 లక్షల మంది అక్కడే స్థిరపడిపోయిన భారత సంతతికి చెందినవారు. మారిషస్ దేశంలోనైతే ఏకంగా 66% జనాభా భారతీయ మూలాలున్నవారే కావటం విశేషం.