Mumbai Indians : రాబోయే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకి మూలిగే నక్కపై తాటి పండు పడినట్టయ్యింది. హార్దిక్ పాండ్యా ఆసుపత్రిలో ఉండగానే కొంపలు అంటుకుపోతున్నట్టు కొత్త కెప్టెన్ గా ప్రకటించింది. తనెప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి ఉంది. సరే తను రాకపోతే పోయాడు… తమకు మరొకడున్నాడు. అతనే సూర్య కుమార్ యాదవ్ అని తలచారు. ప్రస్తుతం తను కూడా వచ్చేలా కనిపించడం లేదు.
మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్టు వీళ్లిద్దరినీ చూసుకుని రోహిత్ శర్మని కాలదనుకున్నారు. ఇప్పుడు మళ్లీ తనే దిక్కయ్యేలా ఉన్నాడు. మరి రోహిత్ శర్మని అంతగా అవమానించిన ముంబై జట్టుకి కెప్టెన్ గా తను ఉంటాడా? స్పోర్ట్స్ మేన్ స్పిరిట్ ప్రదర్శిస్తాడా? అని నెట్టింట అప్పుడే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇంత జరిగిన తర్వాత ముంబై జట్టు అయినా సరే, రోహిత్ శర్మని పిలిచి పీఠమెక్కిస్తుందా? అనేది కూడా డౌటే అంటున్నారు. ఇప్పుడు ముంబై జట్టుకి కెప్టెన్ ఎవరు? దిక్కెవరు?అని అంటున్నారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. అదేమిటంటే టీమిండియా వైస్ కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా కూడా ముంబై జట్టులోనే ఉన్నాడు.
అయితే ఈ కెప్టెన్సీ ఎపిసోడ్ లో తను కూడా హర్ట్ అయ్యాడు. మొదట హార్దిక్ పాండ్యాను కెప్టెన్ అనగానే తను ముంబై ఇండియన్స్ ని సామాజిక మాధ్యమాల్లో అన్ ఫాలో చేశాడు. అంతేకాదు కొన్ని కొటేషన్స్ కూడా కొట్టాడు. అదేమిటంటే ‘కొన్నిసార్లు నిశబ్దమే ఉత్తమ సమాధానం’ అంటూ రాసుకొచ్చాడు. దీనికి ముంబై ఇండియన్స్ కూడా కౌంటర్ ఇచ్చింది. తను రాసిన కొటేషన్ మళ్లీ యథాతథంగా పోస్ట్ చేసింది. మరి బూమ్రాకి ఏమి అర్థమైందో తెలీదు గానీ మళ్లీ ముంబయి ఇండియన్స్ ని ఫాలో అవడం ప్రారంభించాడు.
ఇన్ని చికాకులు, తలనొప్పులు, అంతర్మథనాలు, అసంతృప్తులు చూస్తుంటే ముంబై జట్టులో ఆటగాళ్లు కొందరు రగిలిపోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు మూడు గ్రూపులుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రోహిత్ శర్మని తప్పించి అభిమానులతో తలబొప్పి కట్టించుకున్న ముంబై ఇండియన్స్ పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలకలా తయారైందని అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఇది వచ్చే ఐపీఎల్ లో జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.