Samsung King : దేశంలో దసరా, దీపావళి సీజన్లలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఓ రేంజ్ లో జరిగాయి. ఇందులో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో ఆపిల్ తొలిసారి అగ్రస్థానంలో నిలిస్తే… ఏకంగా 99 శాతం వృద్ధితో శాంసంగ్ కూడా కింగ్ అనిపించుకుంది. అనలిటిక్స్ సంస్థ కౌంటర్ పాయింట్ తన తాజా నివేదికలో ఈ వివరాలు పేర్కొంది.
దేశంలో ఈ ఏడాది ఐఫోన్ 13 సిరీస్ అమ్మకాలు బాగా జరిగాయి. ఏ రేంజ్ లో అంటే… ప్రీమియం స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో నంబర్ 1 స్థానం సాధించిన తొలి ఆపిల్ ఫోన్ గా… ఐఫోన్ 13 నిలిచింది. మొత్తంగా చూస్తే… ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విభాగంలో ఆపిల్ 40 శాతం మార్కెట్ సాధించగా… స్మార్ట్ఫోన్ విపణిలో 5 శాతం వాటా పొందింది. ఐఫోన్ అమ్మకాల్లో దేశీయంగా ఇదే రికార్డు.
ఇక శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు కూడా దుమ్మురేపాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఏకంగా రూ.14,400 కోట్ల విలువైన ఫోన్లు అమ్మేశామని శాంసంగ్ ఇండియా తెలిపింది. రూ.30 వేల కంటే ఎక్కువ విలువైన ప్రీమియం ఫోన్ల అమ్మకాల్లో 99 శాతం వృద్ధి సాధించామని ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ దాకా 5జీ ఫోన్లు రికార్డు స్థాయిలో జరిగాయని, 2021తో పోలిస్తే కంపెనీ వ్యాపారం మొత్తం 20 శాతం వృద్ధి చెందిందని వెల్లడించింది.
మరోవైపు… ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ… స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో తొలిస్థానంలో నిలిచింది. ఇక వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు థర్డ్ క్వార్టర్లో 35 శాతం పెరిగాయి. ప్రీమియం స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో వన్ ప్లస్ మూడో స్థానంలో నిలిచింది.