TS Cabinet Meeting : తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది.ఈ భేటీలో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వివిధ అంశాలపై చర్చించారు.
అభయహస్తం హామీలపై 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇతర అంశాలకు సంబంధించి మరో 20 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అతి తక్కువ సమయంలో 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరించామన్నారు. ప్రస్తుతం డేటా ఎంట్రీ జరుగుతోందని తెలిపారు. ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు.
6 పథకాల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు పొంగులేటి. కమిటీ ఛైర్మన్గా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యవహరిస్తారని వెల్లడించారు. కమిటీ సభ్యులుగా శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ , తాను ఉంటామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను 40 రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ప్రతి గ్రామానికి, తండాకు అధికారులు వెళ్లి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారని పొంగులేటి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారన్నారు. అసలైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పథకాలు అమలు కాలేదని నెల రోజులకే విమర్శిస్తున్నారని ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ కార్డులకు సంబంధించి త్వరలో స్పష్టత ఇస్తామన్నారు.