TSRTC : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకానికి ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని టిఎస్ఆర్టీసి ఎండీ వీసీ సజ్జన్నార్ ట్వీట్ చేశారు. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుందని ఆయన అన్నారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు.
ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని అన్నారు. ఇది టిఎస్ఆర్టీసి యాజమాన్యం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని తెలిపారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని.. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని ఆయన కోరారు. ఒకవేల ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని అన్నారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల మహిళలు ఎధావిధిగా టికెట్ తీసుకుని సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు.
ఉచితమే కదా.. జీరో టికెట్ ఎందుకు తీసుకోవాలని కొందరు ప్రయాణికులు సిబ్బందితో వాదనకు దిగుతున్నారని.. ఇది సరికాదని అన్నారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టిఎస్ఆర్టీసికి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని తెలిపారు. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే టిఎస్ఆర్టీసికి నష్టం చేసిన వాళ్లవుతారని అన్నారు. కావున ప్రతి మహిళ కూడా జీరో టికెట్ను తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధిస్తారని తెలిపారు. అదే కాకుండా సిబ్బంది ఉద్యోగం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని టిఎస్ఆర్టీసికి సహకరించాలని ఎండీ వీ సీ సజ్జన్నార్ ప్రయాణికులను కోరారు.