Vyuham Movie: వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఈ చిత్రం గతేడాది విడుదల కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా రాజకీయంగా తమను కించపరిచే విధంగా ఉందని.. తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందంటూ నారా లోకేశ్ ఈ మూవీపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ను విచారించిన సింగిల్ బెంచ్ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
దీనిని సవాల్ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సింగిల్ బెంచ్లోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఈ సినిమాపై చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వేసిన పిటిషన్ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్తో పాటు రికార్డ్స్ను కోర్టుకు సెన్సార్ బోర్డు సమర్పించింది. ఈ రికార్డులను చూసిన అనంతరం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు విచారణను రేపటికి వాయిదా వేసింది.