Nara Lokesh : వైసీపీ ప్రభుత్వ పాపాలు.. విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. పాఠశాలల్లో గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలతో విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనమవుతోందన్నారు. ప్రజలారా తరలి రండి.. మహమ్మారిపై యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు.
‘‘వైసీపీ పాలనలో బడి, గుడిలోకి గంజాయి వచ్చింది. విద్యార్థులు మద్యం మత్తులో బడికి వస్తున్నారు. గంజాయికి బానిసైన ఓ పిల్లాడి తల్లి సీఎం జగన్ ఇంటి ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తల్లిని పోలీసులు బెదిరించి నోరు మూయించారు. సీఎం ఇంటికి సమీపంలో డ్రగ్స్ మత్తులో గ్యాంగ్ రేప్ జరిగితే ఇప్పటికి నిందితుడిని పట్టుకోలేదు. మద్యం మత్తులో ఓ ఉన్మాది.. అంధురాలిని హత్యచేస్తే చర్యల్లేవు. గంజాయి, మద్యం, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాల నుంచి పిల్లలను కాపాడే వరకూ పోరాడుతూనే ఉంటా ” అని లోకేశ్ స్పష్టం చేశారు.
“చంద్రగిరిలో 9వ తరగతి విద్యార్థిని గంజాయికి బానిసైంది. చోడవరంలో ఏడో తరగతి విద్యార్థులు స్కూలులో మద్యం సేవించారు. వీడియో తీసిన ఓ వ్యక్తిపై వారు దాడి చేశారు. దండుపాళ్యం వైసీపీ సర్కారుకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఈ మహమ్మారి ప్రభుత్వంపై ప్రతిపక్షంగా ఉంటూనే రాజీలేని పోరాటం సాగిస్తున్నాం. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం. మనమంతా కలిసి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం యుద్ధం చేద్దాం. మన పిల్లల్ని కాపాడుకుందాం’’ అని లోకేశ్ పిలుపునిచ్చారు.