Telangana BJP : పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. 10 ఎంపీ సీట్లు గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. 35 శాతం ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈ మీటింగ్ లో రాష్ట్ర ఇన్ఛార్జులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ పాల్గొన్నారు. అలాగే రాష్ట్రానికి చెందిన కీలక నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులపై సమాలోచనలు జరిపారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 ఎంపీ సీట్లు సాధించింది. అప్పుడు ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎంపీలు గెలిచారు. ఈసారి రెట్టింపునకు పైగా లోక్ స్థానాలు గెలివాలని కాషాయ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు.
మరోవైపు పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపైనా కిషన్ రెడ్డి చర్చించారని తెలుస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు గెలిచింది. అయితే ఇప్పటి వరకు సభాపక్షనేతను ఎన్నుకోలేదు. హ్యాట్రిక్ విజయాలు సాధించిన రాజాసింగ్ కు ఆ పదవి కట్టబెడతారా? లేక మరో నేతకు ఆ బాధ్యతలు ఇస్తారనే అనేది ఆసక్తికరంగా మారింది.