Medaram jatara updates(Telangana news live) :
తెలంగాణ కుంభమేళా.. మేడారం మహాజాతరకు కాంగ్రెస్ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ జాతర జరగనుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కింది. ఈ క్రమంలోనే జాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క.. ఓవర్ లోడ్ తో వచ్చే లారీలను అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలానే జాతరకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీతక్క సూచించారు. ఇసుక లారీలను నియంత్రించాలని అధికారులను ఆదేశించిన సీతక్క.. అధిక లోడుతో వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి వెల్లడించారు. మేడారం జాతర పనుల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అధికారులైతే ఇంటికి.. కాంట్రాక్టర్లు అయితే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తారని మంత్రి సీతక్క హెచ్చరించారు.