నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు పెద్దలు. మనం మాట్లాడే విధానం బట్టే.. మనకు గౌరవం దక్కుతుంది. అందుకే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండేవారు మరింతగా ఆలోచించి మాట్లాడాలి. అనాలోచితంగా, ఆవేశపూరితంగా మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మాల్దీవుల మంత్రులు ఓ ఉదాహరణగా మారారు.
భారత్పై, ప్రధానిమోదీపై అనుచిత వ్యాఖ్యల చేసిన మాల్దీవుల మంత్రులు భారీ మూల్యం చెల్లించుకున్నారు. మాల్దీవుల అద్యక్షుడు వారిపై వేటు వేశారు. ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన చేయడంపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. వెనకా ముందు ఆలోచించకుండా చేసిన వ్యాఖ్యలకు వ్యక్తిగతంగా పదవుల ఊడగొట్టుకోవడమే కాకుండా.. ఆ దేశ పర్యాటక రంగం ప్రమాదంలో పడటానికి కారణమయ్యారు.
ఈనెల 2, 3 తేదీల్లో ప్రధాని లక్షద్వీప్ లో పర్యటించారు. అక్కడ బీచ్ లో కాసేపు రెస్ట్ తీసుకున్నారు. అంతే కాదు.. స్నార్కెలింగ్ అనే అడ్వెంచరస్ స్విమ్మింగ్ చేసి సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను విజిట్ చేశారు. ఆ ఫోటోలను, వీడియోలను ట్విట్టర్లో షేర్ చేశారు. అంతే.. మోడీ దెబ్బకు ఒక్కసారిగా ఇంటర్నెట్లో లక్షద్వీప్ విజిటింగ్ ప్రాంతాలపై సెర్చింగ్ పెరిగి ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో పక్కనే ఉన్న మాల్దీవుల పర్యాటకం దెబ్బ తింటుందని భావించిన ఆ దేశమంత్రులు మోడీపై అక్కసు వెళ్లగక్కారు.
మోడీ ఓ విదూషకుడు, తోలుబొమ్మ అని మాల్దీవుల యువజన సాధికార శాఖ సహాయ మంత్రి మరియం షియూనా ట్వీట్ చేశారు. ఆయన దారిలోనే మరో ఇద్దరు మంత్రులు మాల్షా షరీఫ్, మజూమ్ మాజిద్ కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఇక ఆ దేశ ఎంపీ జాహిద్ రమీజ్ అయితే.. భారత్ ను ఛాలెంజ్ చేసేలా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వీడియోను ట్యాగ్ చేస్తూ టూరింజంలో మాల్దీవులతో పోటీ పడాలనకోవడం మూర్కత్వం అవుతుందని అన్నారు. అసలు తమ లాంటి సర్వీసుల ఇవ్వగలరా? అని సవాల్ చేశారు. శుభ్రతను పాటించడం భారత్ వల్ల కాదని ట్వీట్ చేశారు.
అంతే.. మాట్లాడింది చాలు అన్నట్టు మనోళ్లు సోషల్ మీడియాలో బుర్రకు పదును పెట్టారు. మన క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్ లు రంగంలోకి దిగారు.‘బాయ్కాట్ మాల్దీవ్స్’ హ్యాష్ ట్యాగ్తో ఎక్స్లో భారీ ప్రచారాన్ని ప్రారంభించారు. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం సచిన్ టెండుల్కర్ ట్విటర్లో లక్షద్వీప్ ఫోటోలను షేర్ చేశారు. లక్షద్వీప్ లో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. మాల్దీవులు కంటే లక్షద్వీప్ పర్యాటకంగా అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయని ట్వీట్స్ చేశారు. వారు లక్షద్వీప్ లో సందర్శించిన ప్రదేశాలకు గురించి వివరించారు. లక్షద్వీప్, సింధుదుర్గ్ లాంటి ద్వీపాలు కనీసం ఒక్కసారైన విజిట్ చేయాల్సిన ప్రాంతాలని చెప్పారు. సెలబ్రిటీలే కాదు.. సామాన్యులు కూడా బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాస్ట్యాగ్ను వైరల్ చేశారు. కొంతమంది మాల్దీవ్స్ ట్రిప్ ను కూడా రద్దు చేసుకున్నారు. దీంతో.. జరిగిన నష్టాన్ని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. నష్ట నివారణా చర్యలు మొదలు పెట్టింది.
మంత్రుల కామెంట్స్ వారి వ్యక్తిగతమని తేల్చి చెప్పింది. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటనను విడుదల చేసింది. అప్పటికీ.. ‘బాయ్కాట్ మాల్దీవ్స్’ హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతుండడంతో.. మంత్రులపై వేటు వేసింది. మరియం, మాల్షా, మజూమ్లను మంత్రివర్గం నుంచి తొలగించింది.