ఏపీలో అంగన్వాడీలపై తీవ్ర చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంగన్వాడీలను కూడా అత్యవసర సేవల పరిధిలోకి తీసుకొచ్చి.. వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు జనవరి 8 డెడ్ లైన్ విధించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తాము ఎలాంటి బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు. మరి సాయంత్రంలోగా అంగన్వాడీలు విధుల్లో చేరకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది ? అంటే.. 9వ తేదీ నుంచి సీడీపీఓల ద్వారా అంగన్వాడీలకు వారి పేరుమీద నోటీసులు జారీ చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తదుపరి చర్యలపై న్యాయసలహాలు కూడా తీసుకున్నట్లు సమాచారం.
ఈ విషయాలు తెలిసిన అంగన్వాడీలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అక్కలు, చెల్లెళ్లంటూ.. ఎన్నికల ముందు వాగ్ధానాలు చేసి.. ఇప్పుడు వాటిని అమలు చేయాలని అడుగుతుంటే ఎస్మా ప్రయోగించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల సేవలు ఎంత అత్యవసరమో.. తమకు తమ బతుకు అంతే అత్యవసరమన్నారు.
మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ.. రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెలపై స్పందించారు. అంగన్వాడీ, మున్సిపల్ కార్మికులు, ఉపాధ్యాయులు.. ఇలా ఏ రంగానికి చెందిన ఉద్యోగులు సమ్మె చేసినా ఒక్కటేనన్నారు. అంగన్వాడీలు 11 రకాల సమస్యలను తీర్చాలని కోరగా.. వాటిలో 10 నెరవేరుస్తామని చెప్పామని, జీతాలు పెంచాలన్న ఒక్క సమస్యను ఇప్పుడు పరిష్కరించలేమన్నారు. ఎన్నికల ముందు జీతాలను పెంచడం సరికాదని అధిష్టానం భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.