Rape Case : యువతిపై అత్యాచారం జరిగిన సంఘటన పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 6వ తేదీ శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ కేసులో నిందితులను పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ మహ్మద్ షాకీర్అలీ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన యువతి(21) తన తల్లి, సోదరుడితో కలిసి ఇంట్లోనే ఉంటోంది. శనివారం సాయంత్రం ఏదో విషయమై యువతికి తన సోదరుడితో గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన సోదరుడు యువతిని కొట్టాడు. మనస్తాపానికి గురైన ఆ యువతి సూర్యాపేట్ బస్టాండుకు వచ్చి హైదరాబాద్ బస్సెక్కింది.
శనివారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో ఎంజీబీఎస్ బస్టాండులో బస్సు దిగింది. బయటికి వచ్చి టీస్టాల్ లో టీ తాగిన తరువాత అఫ్జల్గంజ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. గౌస్నగర్కు చెందిన ములకలపెంట శ్రీకాంత్ (22), అఫ్జల్గంజ్కు చెందిన పానగంటి కాశీవిశ్వనాథ్(32)లు ద్విచక్రవాహనంపై యువతిని వెంబడించారు. ఆమె దగ్గరికి వెళ్లి ఎక్కడికెళ్లాలని అడగ్గా.. సమీపంలోని పోలీసుస్టేషనుకు వెళ్లాలని యువతి పేర్కొంది. తాము అక్కడికే వెళ్తున్నామని.. నిన్నూ తీసుకెళ్తామని చెప్పి బైకు ఎక్కమన్నారు. వారిని నమ్మిన యువతి ద్విచక్రవాహనం ఎక్కింది.
కొంత దూరం వెళ్లాక అఫ్జల్గంజ్ ప్రాంతంలో ఓ ఐస్క్రీం పార్లర్ వద్ద ఆపి ఐస్క్రీం తినిపించి తమపై నమ్మకం కలిగేలా చేశారు. తరువాత ఆమెను నేరుగా బండ్లగూడ ఠాణా పరిధి లేక్వ్యూ హిల్స్ సమీపంలోని శ్రీకాంత్కు చెందిన స్క్రాప్ గోడౌన్లోకి తీసుకువెళ్లారు. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరోచోటికి తరలించేందుకు బైకుపై తీసుకెళ్తుండగా బాధితురాలు గట్టిగా అరిచింది.
స్థానికులు గమనించడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ కె.గురునాథ్, బండ్లగూడ ఎస్సై వెంకటేశ్వర్జీలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలను సేకరించారు. తనపై అఘాయిత్యం జరిగిన స్క్రాప్ గోడౌన్ను ఆమె పోలీసులకు చూపించింది. ఈ గోడౌన్ శ్రీకాంత్ కు చెందినదని స్థానికులు చెప్పారు.
వెంటనే పోలీసులు నిందితుడిని గోడౌన్ సమీపంలోనే పట్టుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో కాశీవిశ్వనాథ్ను కూడా అదుపులోకి తీసుకుని.. విచారణ చేయగా ఇద్దరూ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.