Akshardham | మన సనాతన ధర్మాన్ని, పౌరాణిక వైభవాన్ని చాటిచెబుతున్న ఆధునిక ఆలయాల్లో అక్షరధామ్ ముందువరుసలో ఉంటుంది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయం నవంబర్ 7, 2005న నాటి రాష్ట్రపతి డా. అబ్దుల్ కలామ్ గారి చేతుల మీదగా ఆవిష్కృతమైంది. అద్భుత భారతీయ నిర్మాణ శైలికి, అత్యాధునిక సాంకేతికతకు అసలైన చిరునామాగా దేశ రాజధాని ఢిల్లీలో అలరారుతున్న ఈ ఆలయ విశేషాలు.. మీకోసం.
Akshardham | మన సనాతన ధర్మాన్ని, పౌరాణిక వైభవాన్ని చాటిచెబుతున్న ఆధునిక ఆలయాల్లో అక్షరధామ్ ముందువరుసలో ఉంటుంది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయం నవంబర్ 7, 2005న నాటి రాష్ట్రపతి డా. అబ్దుల్ కలామ్ గారి చేతుల మీదగా ఆవిష్కృతమైంది. అద్భుత భారతీయ నిర్మాణ శైలికి, అత్యాధునిక సాంకేతికతకు అసలైన చిరునామాగా దేశ రాజధాని ఢిల్లీలో అలరారుతున్న ఈ ఆలయ విశేషాలు.. మీకోసం.
అక్షరధామ్ ఆలయ నిర్మాణానికి సంకల్పించింది.. స్వామీ నారాయణ మహరాజ్. వీరికే సహజానంద అని పేరు. అయోధ్యకు సమీపంలోని ఛాపయ్యా గ్రామంలో 1781లో ఆయన జన్మించిన స్వామీ నారాయణులు.. తండ్రి వద్ద ఏడేళ్లకే వేద, పురాణాల సారాన్ని గ్రహించారు. పదకొండేళ్ల వయసులో తీర్థయాత్రలకు శ్రీకారం చుట్టారు. ఏడేళ్ళ తన తీర్థయాత్రా కాలంలో ఆయన భారత సంస్కృతీ రూపాల్ని ఆకళింపుజేసుకుని, చివరకు గుజరాత్లో నివసిస్తూ.. సాంఘిక, ఆధ్యాత్మిక విప్లవానికి నాందిపలికారు. 1830లో వీరు పరమపదించారు.
అనంతరం యమునా తీరంలో ఓ భవ్యమైన విష్ణు ఆలయం నిర్మించాలనే స్వామీ నారాయణుల సంకల్పం.. ఆయన వారసుడు బొచాసన్వాసి శ్రీ అక్షర పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బ్యాప్స్) కు ఆధ్యాత్మిక గురువైన ప్రముఖ్ స్వామి మహారాజ్ (83) ద్వారా సాకారమైంది. ఈ బ్యాప్స్ సంస్థ ఢిల్లీలోనే గాక అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలలో సుమారు 600 ఆలయాలను నిర్మించింది.
అక్షరధామ్ అంటే.. పరమాత్ముని శాశ్వత నివాసం అని అర్థం. స్వామీ నారాయణుల పేరిట నిర్మించారు గనుక దీనికి ‘స్వామి నారాయణ్ అక్షరధామ్’ అంటారు. ఇక్కడి ప్రధాన దైవం.. విష్ణువు. గర్భాలయంలో 11 అడుగుల విష్ణుమూర్తి పంచలోహ విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. రాజస్థానీ సంప్రదాయాల ప్రకారం నిర్మించిన ఈ ఆలయంలోని పాలరాతి శిల్పాలు, మనదేశపు పలువురు కవులు, సాధుసంతుల విగ్రహాలు భక్తులను మరోలోకానికి తీసుకుపోతాయి. అహ్మదాబాద్ వాస్తు శిల్పి వీరేంద్ర త్రివేది దీని నిర్మాణ భాధ్యతలను తీసుకున్నారు.
రెండు అంతస్తులుగా, 1660 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ ఓ ప్రదక్షిణం చేయాలంటే 2 కి.మీ నడవాల్సి ఉంటుంది. 148 రాతి ఏనుగులు ఆలయాన్ని వీపుపై మోస్తున్నట్లుగా నిర్మించారు. 145 కిటికీలతో, 154 శిఖరాలతో అలరారే ఇక్కడి ప్రధానాలయం ఎత్తు 141 అడుగులు కాగా పొడవు 370 అడుగులు, వెడల్పు 316 అడుగులు. దీని నిర్మాణానికి 11 వేల మంది కార్మికులు, 7000 వాలంటీర్లు పనిచేశారు. భూకంపాలు, ప్రకృతి విపత్తులను తట్టుకుని 1000 ఏళ్ల పాటు నిలిచేలా నిర్మించిన ఈ ఆలయ నిర్మాణానికి రూ. 200 కోట్ల రూపాయల ఖర్చైంది. ఈ మొత్తమంతా విరాళాల రూపంలోనే సేకరించటం విశేషం.
అంగుళం స్టీలు కూడా వాడకుండా రాజస్థాన్లోని పిండ్వారా, సికంద్రా పట్టణాల నుంచి సేకరించిన వేలాది టన్నుల కెంపు రంగు పాలరాయి, ఇసుక రాయితో దీనిని నిర్మించారు. బదరీనాథ్, కేదార్నాథ్, సోమనాథ్, కోణార్క్ ఆలయాల శైలుల స్ఫూర్తితో, వైదిక ఆగమ నియమాల ప్రకారం దీనిని నిర్మించారు. ఆలయానికి భక్తి ద్వార్, మయూర్ ద్వార్ అనే రెండు పెద్ద గేట్లు నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 9 లక్షల మొక్కలు, చెట్లతో భక్తులు ధ్యానం చేసుకునే వనాన్ని ఏర్పాటుచేశారు. ప్రధాన మందిరం పక్కనే కర్మకాండల కోసం.. 9 వేల అడుగుల నిడివి, 2870 మెట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద యజ్ఞకుండం కూడా ఉంది.
ప్రపంచపు అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కెక్కిన అక్షరధామ్ దేవాలయ ఇక.. ఈ ప్రాంగణంలోని స్వామీ నారాయణుల మ్యూజియంలో మట్టి విగ్రహాలతో కూడిన ఆయన జీవిత విశేషాలను కళ్లకు కట్టినట్లు వివరించే ఏర్పాట్లున్నాయి. సంస్కృతి విహార్ పేరుతో ఇక్కడ భూగర్బంలో ఏర్పాటు చేసిన ఓ నదిలో భక్తులు పడవ ప్రయాణం చేస్తారు. 12 నిమిషాల ఈ ప్రయాణంలో 10 వేల ఏళ్లనాడు.. మన భారతదేశ జీవిత విధానాన్ని సజీవంగా చూడొచ్చు.