Mallu Ravi : కాంగ్రెస్ పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలోని ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో సామాన్యుల సమస్యలు అన్ని సులభంగా పరిష్కారం అవుతున్నాయని మల్లు రవి తెలిపారు.
అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలను దిగజార్చే విధంగా ఉందని మల్లు రవి మండి పడ్డారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే ప్రతిపక్ష నాయకులు ఎదురుదాడికి దిగారన్నారు. పిల్లి శాపాలు పెట్టడం చూస్తుంటే అధికారం కోల్పోయి ఎంత బాధలో ఉన్నారో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే విప్లవాత్మక మార్పులు తెచ్చిందని మల్లు రవి అన్నారు. అభివృద్దిని ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేపోతున్నారని ఆయన విమర్శించారు. ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం అనేక సమస్యలపై సమీక్షలు చేసి పరిష్కారాలు చూపుతున్నారని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రగ్స్పై సీఎం రేవంత్రెడ్డి యుద్ధం ప్రకటించారన్నారు. అందుకు అనుగుణంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను పటిష్టం చేశామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మెట్రోను పాత బస్తీతో పాటు నగరమంతా విస్తరిస్తామని తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకుంటుందని మల్లు రవి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.