Boycott Maldives | హిందూ మహా సముద్రంలోని ద్వీపదేశమైన మాల్దీవులకు వ్యతిరేకంగా ట్విట్టర్లో ‘బాయ్కాట్ మాల్దీవ్స్’ యాష్ టాగ్ ట్రెండవుతోంది. భారత వ్యతిరేక, చైనా అనుకూల వైఖరిని అవలంబిస్తు్న్న అక్కడి నూతన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ(MOhamed Moizzu) తీసుకొచ్చిన సరికొత్త విదేశాంగ పాలసీయే ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణం
Boycott Maldives | హిందూ మహా సముద్రంలోని ద్వీపదేశమైన మాల్దీవులకు వ్యతిరేకంగా ట్విట్టర్లో ‘బాయ్కాట్ మాల్దీవ్స్’ యాష్ టాగ్ ట్రెండవుతోంది. భారత వ్యతిరేక, చైనా అనుకూల వైఖరిని అవలంబిస్తు్న్న అక్కడి నూతన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ(MOhamed Moizzu) తీసుకొచ్చిన సరికొత్త విదేశాంగ పాలసీయే ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణం. దీని వివరాల్లోకి వెళితే..
భారతదేశానికి నైఋరుతి మూలన, హిందూ మహాసముద్రంలోని 1,196 పగడపు దీవుల సమాహారమే మాల్దీవులు. కేవలం 300 చదరపు కి.మీ విస్తీర్ణంగల ఈ దేశంలో ఒకప్పుడు బౌద్ధ, హిందూ సంస్కృతి అలరారినా.. కాలక్రమంలో ఇస్లాందేశంగా మారిపోయింది. చాలాకాలం స్వతంత్ర ముస్లిం రాజ్యంగా ఉన్న ఈ దేశం.. పోర్చుగీసు, బ్రిటిషర్ల పాలనలో ఉంది. 1965లో బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందినా.. మూడేళ్ల పాటు సుల్తాను పాలనలో ఉన్న మాల్దీవులు.. 1968 నవంబరు 11న రిపబ్లిక్గా ఏర్పడింది. గల్ఫ్ నుంచి వచ్చే చమురు నౌకలు ఇక్కడి నుంచే వెళతాయి గనుక ఈ దేశం.. వ్యూహాత్మకంగా కీలక ప్రదేశంగా గుర్తింపు పొందింది.
1978లో ఆ దేశాధ్యక్షుడైన మౌమూన్ అబ్దుల్ గయూమ్.. 2003 వరకు ఏకఛత్రాధిపత్యంగా ఆ దేశాన్ని పాలించాడు. ఆదినుంచి భారత్ అనుకూలుడైన గయూమ్ను గద్దె దించేందుకు అక్కడి సైన్యం.. 1988లో కుట్ర చేసింది. అప్పట్లో భారత దళాలు మాల్దీవులకు వెళ్లి ఆయనను కాపాడాయి. కానీ.. భౌగోళికంగా కీలక స్థానంలో ఉన్న మాల్దీవుల మీద కన్నేసిన చైనా.. గయూమ్ను వ్యతరిరేకించే స్థానిక రాజకీయ నాయకులను మచ్చిక చేసుకునేందుకు దశాబ్దాలుగా కృషి చేస్తూనే వచ్చింది.
ఈ క్రమంలో 2018 నాటి ఎన్నికల్లో మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) అక్కడ గెలిచి, ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ఆ దేశాధ్యక్షుడయ్యాడు. ‘ఇండియా ఫస్ట్’ అంటూ.. ఆయన భారత్తో సాంస్కృతికంగా, ఆర్థికంగా బలమైన సంబంధాలను ఏర్పరుచుకున్నారు. సోలి అభ్యర్థన మేరకు 2019లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల్లో పర్యటించినప్పుడు అక్కడి సముద్ర జలాలు, పగడపు దిబ్బలు, సముద్రపు అలలను సంయుక్తంగా అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని కూడా ఆ దేశంతో కుదుర్చుకున్నారు.
అయితే.. అంతకుమునుపు స్నేహ సంబంధాల్లో భాగంగా మనదేశం 2010, 2013లో 2 హెలికాప్టర్లు, సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లతో పాటు వైద్య సాయం కోసం 2020లో ఒక ఎయిర్క్రాఫ్ట్ను ఆ దేశానికి బహుమతిగా ఇచ్చింది. వీటి నిర్వహణ కోసం 75 మంది భారత సైనికులు.. మాల్దీవుల్లో ఉంటూ వచ్చారు. దీనిని ఆ దేశంలో చైనా అనుకూల విపక్షాలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. 2023 సెప్టెంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో.. తమ దేశం నుంచి భారత దళాలు వెనక్కి వెళ్లాలంటూ చెప్పే ‘ఇండియా ఔట్’ నినాదపు ప్రభావం ఎక్కువ ఉండడంతో అధికార పార్టీ ఓడిపోయి.. చైనా అనుకూల విపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ గెలిచి.. ఆ పార్టీ నేత మహహ్మద్ మయిజ్జు అధ్యక్షుడయ్యాడు.
బాధ్యతలు చేపట్టిన వెంటనే మయిజ్జు.. 2019 నాటి హైడ్రో గ్రాఫిక్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మాల్దీవుల్లో మోహరించిన తన సైనికులను ఉపసంహరించుకోవడానికి భారత ప్రభుత్వం అంగీకరించిందని కూడా ముయిజ్జు ప్రకటించారు. కొత్త అధ్యక్షుడిగా అన్ని విధాలా అండగా నిలుస్తున్న భారత్లో కాకుండా.. భారత్ను వ్యతిరికిస్తున్న తుర్కియే(టర్కీ)ని తన తొలి పర్యటన కోసం ఎంచుకున్నారు. అక్కడ మాల్దీవుల రాయబార కార్యాలయాన్ని ప్రారంభించి.. ఇకపై తమ రోజువారీ అవసరాలన్నీ తుర్కియే నుంచి దిగుమతి చేసుకుంటామని, ఆ దేశపు పెట్టుబడులను ఆహ్వానిస్తామని ప్రకటించారు.
అధ్యక్షుడు పర్యటన ముగించి మాల్దీవులకు చేరగానే.. చైనా నేతృత్వంలోని ‘చైనా-ఇండియా ఫోరమ్ డెవలప్మెంట్ కో ఆపరేషన్’ సమావేశంలో పాల్గొనేందుకు మాల్దీవుల ఉపాధ్యక్షుడు.. హుస్సేన్ మొహమ్మద్ లతీఫ్ చైనాలో పర్యటించారు. నిజానికి మాల్దీవుల్లో ఒకదీవిని 50 ఏళ్ల కాలానికి రూ. 33 కోట్లు చెల్లించి 2016లో చైనా లీజుకు తీసుకుంది. చైనా ప్రారంభించిన.. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్కు కూడా మాల్దీవులు బహిరంగంగా మద్దతు పలికింది. తాజాగా.. అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత చైనా నౌకాదళం మాల్దీవులలో తన ప్రభావాన్ని పెంచుకునే పనిలో ఉంది.
భారత భూ, సముద్ర భద్రత అవసరాలకు సంబంధించి చైనా, తుర్కియే రెండూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో మన ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ను సందర్శించారు. సముద్ర టూరిజాన్ని ఇష్టపడే వారంతా ఇక మన లక్ష్యద్వీప్ను సందర్శించాలని కోరారు. దీనిపై మాల్దీవుల ప్రోగ్రెసివ్ పార్టీ మెంబర్ జహీద్ రమీజ్ ఎక్స్లో చేసిన పోస్టులు మనదేశంలో దుమారం రేపాయి. రమీజ్ పోస్టులపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఎక్స్లో లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్గా మారింది. ఇకపై భారతీయులు.. మాల్దీవులకు వెళ్లకుండా లక్షద్వీప్కు వెళ్లాలని నెటిజన్లు పిలుపునివ్వటంతో ‘బాయ్కాట్ మాల్దీవ్స్’ ట్రెండింగ్గా మారింది. దీనిని బలపరుస్తూ.. పెద్ద సంఖ్యలో భారత పర్యాటకులు తమ మాల్దీవుల టికెట్లను రద్దు చేసుకుంటున్నారు.