EVs Market : పెట్రోల్, డీజిల్ వెహికల్స్ స్థానంలో విద్యుత్తు వాహనా(ఈవీ)లను ప్రవేశపెట్టడంలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఈ పోటీని ఎదుర్కొనేందుకు భారత్ కొత్త వ్యూహాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా ఈవీ పరిశ్రమ బలోపేతానికి పటిష్ఠమైన విధానాలను అనుసరిస్తున్న జర్మనీ, దక్షిణ కొరియాల వంటి దేశాల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షించాలనే యోచనలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటికే దేశంలో టెస్లా ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇవి కొలిక్కి వచ్చినా.. విద్యుత్తు వాహనాల వైపు మళ్లడంలో ఎలక్ట్రిక్ కార్లు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. వాహన్ డ్యాష్బోర్డ్ ప్రకారం 2023లో దేశంలో 72,930 ఎలక్ట్రిక్ కార్లు కొత్తగా నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఈ సంఖ్య డబుల్.
అయితే ఈ-మొబిలిటీ విషయంలో దక్షిణాసియా దేశాలు ఎక్కువగా టూ వీలర్స్, ఈ-రిక్షాలు, ఇతర త్రీ వీలర్స్పైనే దృష్టి సారించాయి. నిరుడు మొత్తం ఈవీ అమ్మకాల్లో 56% టూ వీలర్లు ఉండగా.. 38% త్రీవీలర్లు ఉన్నాయి. ఇక ఈవీ మార్కెట్ వాటా నిరుడు 6.3 శాతానికి చేరింది. కొవిడ్ నాటితో పోలిస్తే ఆరు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడేళ్ల క్రితం ఈ వాటా ఒక శాతం కన్నా తక్కువే ఉంది.
2023లో ఈవీ రంగం అంత ఆశాజనకంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రభుత్వ సబ్సిడీ. ఫేమ్-2 స్కీం కింద కేంద్ర ప్రభుత్వం 600 మిలియన్ డాలర్ల సబ్సిడీని అందజేసింది. 2030 నాటికి ఈవీ మార్కెట్ వాటాను 30 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈవీ రంగంలో చైనా మహా దూకుడు ప్రదర్శిస్తోంది. 2022లో అమ్ముడైన కార్లలో 22 శాతం విద్యుత్తు వాహనాలే. హైబ్రిడ్ కార్లను కూడా కలుపుకుంటే ఇది 30% వరకు ఉంటుంది. ఇక యూరప్లో కొత్తగా నమోదైన వాహనాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా 23 శాతం. ఇందులో బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటాయే 14% వరకు ఉంటుంది.
వాహన విక్రయాల్లో ఈవీల వాటా 2018లో 0.5 శాతం మాత్రమే. తర్వాత రెండు సంవత్సరాల్లో ఇది 0.7 శాతానికి పెరిగింది. 2021లో ఈవీల షేర్ 1.83%, 2022లో 4.8 శాతానికి చేరింది. నిరుడు ఈవీల వాటా ఏకంగా 6.3 శాతానికి పెరిగింది.