Siddipet : ట్రాన్స్జెండర్గా మారి.. తనను వేధిస్తున్న భర్తను హత్య చేయించిందో భార్య. సుపారీ కింద రూ.18 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్న ఆమె.. రూ.4.60 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది. ప్లాన్ ప్రకారం భర్తను హత్యచేయించింది. ఈ ఘటనపై సిద్దిపేట వన్టౌన్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ రంజిత్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట బోయిగల్లికి చెందిన వేదశ్రీకి నాసర్పూరకు చెందిన దరిపల్లి వెంకటేశ్(33)తో 2014లో వివాహం అయింది. వీరికి 2015లో ఒక పాప జన్మించింది. కొద్ది రోజుల తర్వాత వెంకటేశ్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. అమ్మాయిలాగా ప్రవర్తించడం చెవులకు కమ్మలు, ముక్కుకు పుడక పెట్టుకుని రాత్రి సమయంలో ఆడవారి దుస్తులు ధరించేవాడు. అదనపు కట్నం కోసం తన భార్యను వేధింపులకు గురి చేసేవాడు.
2019లో వెంకటేశ్ ట్రాన్స్జెండర్గా మారి భార్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. వెంకటేశ్ రోజాగా పేరు మార్చుకున్నాడు. పలుమార్లు చీరకట్టుకుని వేదశ్రీ పనిచేస్తున్న స్కూలుకు వెళ్లి వేధిస్తుండటంతో తను ఉద్యోగం కోల్పోయింది. మరో స్కూల్లో చేరినా ఆమెకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో తనకు పరిచయమైన సిద్దిపేట నాసర్పూరకి చెందిన బోయిని రమేశ్తో తన బాధను చెప్పుకుని వాపోయింది. తనను, పాపను వేధిస్తున్న వెంకటేశ్ (రోజా)ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
వేదశ్రీ, రమేశ్ తో కలిసి పట్టణంలోని కాకతీయ ఫుట్వేర్ యజమాని బోయిని రమేశ్తో వెంకటేశ్(రోజా) హత్య కోసం 2023 సెప్టెంబర్లో రూ. 18లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు అడ్వాన్స్గా వేదశ్రీ మొదటగా రూ.2లక్షలు ఇచ్చింది. ఈ క్రమంలో ఫుట్వేర్ రమేశ్ తన స్నేహితుడు అయిన ఇప్పల శేఖర్కు హత్య విషయం తెలిపాడు. ఇప్పల శేఖర్ ప్లాన్ లో భాగంగా వెంకటేశ్ (రోజా)తో పరిచయం పెంచుకున్నాడు. తరచూ అతను వేంకటేశ్ (రోజా)ను కలుస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలోనే ఇప్పల శేఖర్ వెంకటేశ్(రోజా)కు ఫోన్ చేసి వరంగల్ నుంచి సిద్దిపేటకు పిలిపించాడు. బోయిని రమేశ్, ఇప్పల శేఖర్లు దిండుతో ఊపిరాడకుండా చేసి వెంకటేశ్(రోజా)ను హత్య చేశారు. వెంకటేశ్(రోజా) మృతి చెందిన విషయం బయటికి రావడంతో అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టంలో వెంకటేశ్(రోజా)ది హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసుల దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు సేకరించారు. హత్యలో వేదశ్రీతో పాటు మరో ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు తెలిపారు.