Ranji Trophy 2024 : బీహార్ పేరు వింటేనే, ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటుంది. ఆ వైబ్రేషన్ అన్నింటా నడుస్తోంది. అది క్రికెట్ కి కూడా అంటుకుంది. దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ముంబయి-బీహార్ మధ్య మ్యాచ్ జరిగే సమయానికి రచ్చరచ్చ అయ్యింది.
పాట్నాలో మ్యాచ్ ప్రారంభం అవుతుండగా ముంబయి జట్టు యథావిధిగానే వచ్చింది. కానీ బీహార్ నుంచి మాత్రం రెండు జట్లు వచ్చేశాయి. అందరూ ఆశ్చర్యపోయారు. మేమంటే మేం అని వారు ముందుకొచ్చారు. ఇదేంట్రా భగవంతుడా రెండు జట్లు వచ్చాయని అంతా బిత్తరపోయారు.
దీంతో రంజీ నిర్వాహకులు తలలు పట్టుకున్నారు. విషయం ఏమిటంటే బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్ తివారి, అసోసియేషన్ కార్యదర్శి అమిత్ కుమార్ మధ్య వివాదం ఎప్పటి నుంచో నడుస్తోంది. దీంతో వీరిద్దరూ ఏం చేశారంటే చెరో జట్లను ఎంపిక చేసి పారేశారు.
అధ్యక్షుడు ఎంపిక చేసిన జట్టే ఫైనల్ అని ఆయన వాదిస్తాడు. ఆయనకి ఎంపిక చేసే రైట్ లేదని, కార్యదర్శి సంతకం చేస్తేనే జట్టుకి అర్హత అని ఇతను అంటాడు. సమస్య ఎప్పటికీ తేలకపోవడంతో రూల్స్ ప్రకారం అధ్యక్షుడు ఎంపిక చేసిన జట్టునే నిర్వాహకులు అనుమతించారు. దీంతో ముంబయి జట్టు వారితోనే మ్యాచ్ ఆడింది.
ప్రస్తుతం కార్యదర్శి సస్పెన్షన్ లో ఉన్నాడు. అయితే అధ్యక్షుడు రాకేశ్ తివారి కి వళ్లు మండి తనే కార్యదర్శిని సస్పెండ్ చేసేశాడు. అయితే అధ్యక్షుడికి తనని సస్పెండ్ చేసే అధికారం లేదని, తాను ఎన్నికల్లో గెలిచానని కార్యదర్శి వాదిస్తున్నాడు. అందుకే చెరొక టీమ్ ని ఎంపిక చేసి గ్రౌండ్ కి తీసుకొచ్చారు.
మేం టాలెంట్ ఆధారంగా టీమ్ ని ఎంపిక చేశామని అధ్యక్షుడు అంటుంటే, ఆ జట్టు సరైనది కాదని కార్యదర్శి అంటున్నారు. బీసీసీఐ లో కూడా ఇటువంటి రూల్ లేదని తను వాదిస్తున్నాడు.
బీసీసీఐ చీఫ్ ఎప్పుడైనా టీమిండియా ఆటగాళ్లను ప్రకటించారా? అని ప్రశ్నిస్తున్నాడు. బీసీసీఐ కార్యదర్శి సంతకం చేసిన తర్వాతే తుది జట్టు ప్రకటన విడుదల అవుతుందని అంటున్నాడు. ఏదేమైనా ఉన్నత స్థాయిలో ఉన్న వీరిద్దరూ రోడ్డున పడి కొట్టుకోవడం సరికాదని, ఆటగాళ్ల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని కామెంట్ చేస్తున్నారు.
పాపం ఇప్పుడు కార్యదర్శి ప్రకటించిన జాబితాలో ఉన్నవారి పరిస్థితేమిటి? అంటున్నారు. తెలీక కొందరు ఇలా వచ్చి బుక్ అయిపోయి ఉండవచ్చు కదా అని అంటున్నారు. వారికి న్యాయం చేయాలని చెబుతున్నారు.
సగం మంది ఇటు, సగం మంది అటు ఉంటే, అది పూర్తి స్థాయి జట్టు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. బజారున పడిన ఇద్దరు అధికారులపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలని నెట్టింట డిమాండ్లు గట్టిగానే వినిపిస్తున్నాయి.