Shaiva Kshetralu : శైవానికి పట్టుగొమ్మగా నిలిచిన తెలుగునేల మీద అనేక చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యతలు గల శివాలయాలున్నాయి. అయితే.. పలు కారణాల వల్ల నేటికీ తగినంత ప్రచారం లేనికారణంగా ఆ శైవ క్షేత్రాల గురించి మనలో చాలామందికి వీటి గురించి తెలియదు. అలాంటి కొన్ని శైవ క్షేత్రాల సమాచారం.. మీకోసం..
Shaiva Kshetralu : శైవానికి పట్టుగొమ్మగా నిలిచిన తెలుగునేల మీద అనేక చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యతలు గల శివాలయాలున్నాయి. అయితే.. పలు కారణాల వల్ల నేటికీ తగినంత ప్రచారం లేనికారణంగా ఆ శైవ క్షేత్రాల గురించి మనలో చాలామందికి వీటి గురించి తెలియదు. అలాంటి కొన్ని శైవ క్షేత్రాల సమాచారం.. మీకోసం..
జటలతో దర్శనమిచ్చే శివలింగం
శరవేగంగా భూమ్మీదికి వస్తున్న గంగాదేవిని పరమశివుడు తన జటల (తల వెంట్రుకలలో) నిలిపి, భూమికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా గంగమ్మను దించిన సంగతి తెలిసిందే. అయితే.. శివుడిని లింగరూపంలో పూజిస్తాం గనుక మనకు జటలతో కనిపించే శివరూపం ఫోటోలకు, విగ్రహాలకే పరిమితమై కనిపిస్తుంది. కానీ.. తూర్పుగోదావరి జిల్లాలోని పలివెల గ్రామంలో కొలువై ఉన్న శివలింగం మాత్రం.. జటలతో కనిపిస్తుంది. ఇక్కడ ఉమా సమేతుడై దర్శనమిచ్చే స్వామిని.. కొప్పులింగేశ్వరుడు అని పిలుస్తారు.
నదీ గర్భంలోని శివాలయం
ఆరు నెలలు నది నీటిలో మునిగి, ఆరు నెలలు మాత్రమే పూజలందుకునే శివాలయం.. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు, కృష్ణాజిల్లా జగ్గయ్య పేట మండలం మక్త్యాల గ్రామాల మధ్య కృష్ణానదిలో ఉంది. ఇక్కడ పరమశివుడు.. ముక్తేశ్వరుడిగా పూజలందుకుంటాడు. నదీ గర్భంలో ఉన్న కాలంలో స్వామిని దేవతలు ఆరాధిస్తారని ప్రతీతి. కృష్ణమ్మలో ప్రవాహం తగ్గే కొద్దీ ఈ ఆలయం బయట పడుతుంది. ఇక్కడి మరో విశేషం ఏమిటంటే.. ఇక్కడ శివయ్యతో బాటు అమ్మవారు కూడా లింగరూపంలోనే దర్శనమిస్తుంది. ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెండు నందులు కూడా ఉంటాయి. వీటిలో దక్షిణం వైపు వున్న నందిని తిరుగుడు నంది అంటారు.
నందిలేని శివాలయం
మనకు లోకంలో ఎక్కడా నందిలేని శివాలయం కనిపించదు. కానీ.. అనంతపురం జిల్లా అమరాపురం హేమావతి గ్రామంలోని సిద్ధేశ్వరాలయంలో మాత్రం శివుడి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం ఉండదు. దక్షయజ్ఞానికి బయలుదేరిన సతీదేవికి తోడుగా నందీశ్వరుడిని వెళ్లాలని శివుడు ఆదేశిస్తాడు. అలా వెళ్లిన అమ్మవారు అక్కడి యజ్ఞంలో దేహత్యాగం చేసిన సంగతి తెలిసి శివుడు.. ఉగ్రుడై తాండవం చేస్తాడు. ఆ ఉగ్రశివుడి రూపమే ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. సతీదేవి వెంట నంది వెళ్ళిన కారణంగా ఇక్కడ నంది కనిపించదు. శివభక్తుడైన నాళంబరాజు ఈ గుడిని కట్టించాడు.
బొమ్మల మొక్కు చెల్లించే శివాలయం
దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలోని సూర్య గ్రామంలో ఉన్న శివరుద్ర స్వామి ఆలయానికి సమీపంలోని ఓ ఉద్యానవనంలోని రెండు శిలారూపాలనే పార్వతీ పరమేశ్వరులుగా భావించి.. భక్తులు పూజలు చేస్తారు. ఇక్కడ తాము కోరుకున్న కోర్కెలు తీరిన భక్తులు.. స్వామికి అందుకు సంబంధించిన బొమ్మలను మొక్కుగా తీర్చుకుంటారు. (ఉదా: ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరితే ఇల్లు బొమ్మ.. వగైరా)
బ్రహ్మ, విష్ణువులతో ఉన్న శివాలయం
మహా శివరాత్రి అర్థరాత్రి వేళ.. పరమశివుడు లింగాకారంలో ఈ భూమ్మీద అవతరించాడు. నాడు ఆయన తల భాగంలో హంస రూపంలో బ్రహ్మదేవుడు, కింది భాగంలో వరాహ రూపంలో విష్ణువు కూడా నిలబడతారు. శివపురాణంలోని ఈ ఘటనకు రుజువుగా నిలిచే శివలింగం గుంటూరు జిల్లా చందోలులో ఉంది. ఇక్కడి 11 అడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల వైశాల్యం కలిగిన నల్లరాతి శివలింగంపై హంస రూపంలో బ్రహ్మ, అడుగున వరాహ రూపంలో విష్ణుమూర్తి రూపాలను మనం చూడొచ్చు. ఈ లింగోద్భవ క్షేత్రంలోని శివయ్య.. తేజోలింగంగా భాసిస్తున్నాడు.
పావురాలతో ఉన్న శివలింగం
తూర్పుగోదావరి జిల్లా కడలి గ్రామంలోని కపోతేశ్వర ఆలయంలో శివలింగం మీద 2 పావురాలు, మంటపంలో నంది వెనుక భాగంలో వేటగాడు.. ఇలా ఈ విధంగా వుండే శివుడి ఆలయం వుంది. ఈ ఆలయానికి చారిత్రకంగా, పౌరాణికర నేపథ్యం ఉంది.