T20 World Cup 2024 : టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. అయితే ప్రపంచకప్ మ్యాచ్ ల్లో అత్యంత సంచలన కాంబినేషన్ అయిన పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ కి సంబంధించి అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సంస్థ షేర్ చేసిన ఒక పోస్టర్ నెట్టింట చిచ్చు రేపింది.
ఎందుకంటే జూన్ 9న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటూ… ఆ పోస్టర్ పై పాకిస్తాన్ కెప్టెన్ షహీన్ ఆఫ్రిది ఫొటో వేసింది. పక్కనే ఇండియాకి సంబంధించి హార్దిక్ పాండ్యా ఫోటో వేసింది. దీంతో నెట్టింట అభిమానులు భగ్గుమన్నారు. అసలు మీకెవడు హార్దిక్ పాండ్యా కెప్టెన్ చెప్పాడని, రోహిత్ శర్మ అభిమానులు చెడుగుడు ఆడుకుంటున్నారు.
పాకిస్తాన్ కి అంటే ఆల్రడీ డిసైడ్ అయిపోయింది, ఇండియాకి ఇంకా ప్రకటించలేదు, అంతేకాదు రోహిత్ శర్మ అధికారికంగా టీ 20ల నుంచి వైదొలగుతానని చెప్పలేదు. ఒకవేళ తను ఐపీఎల్ లో కూడా ఎక్కువ మ్యాచ్ లు ఆడకపోయే అవకాశాలే ఉన్నాయి. అయినా సరే, టీమ్ ఇండియా ఇంకా ఎవరి కెప్టెన్సీలో ఆడుతుందో తెలీదు. అలాంటప్పుడు మీరెలా నిర్ణయాలు తీసుకుంటారని స్టార్ స్పోర్ట్స్ సంస్థపై ఒంటి కాలు మీద లేస్తున్నారు.
ఒకవైపున టీ 20 టీమ్ ని సెలక్ట్ చేసేందుకు సీనియర్లు కొహ్లీ, రోహిత్ శర్మ నిర్ణయాలను తెలుసుకునేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏకంగా సౌతాఫ్రికా వెళ్లింది. భారతదేశంలో వారిద్దరికి ఇచ్చే విలువ అదని గ్రహించమని చెబుతున్నారు. బీసీసీఐ అంత గౌరవం ఇస్తుంటే, మీరిలా అవమానించడం సరికాదని అన్నారు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో విజయాలు సాధించినంత వరకు ఆకాశానికి ఎత్తి, ఇప్పుడు కెప్టెన్సీపై ఎవరికివారు తమిష్టం వచ్చినట్టు వ్యవహరించడం సరికాదని అంటున్నారు. అర్జెంటుగా ఆ ఫొటో మార్చమని చెబుతున్నారు. లేదంటే బీసీసీఐ కెప్టెన్ ప్రకటించేవరకు ఆ పోస్టర్ ని ఆపు జేయమని చెబుతున్నారు.
ముంబై ఇండియన్స్ లాగే మీరు కూడా డిసైడ్ చేసేశారా? అని స్పోర్ట్స్ సంస్థను ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే హార్దిక్ పాండ్యా గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటాడో ఎవరికీ తెలీదు. మరోవైపు సూర్యకుమార్ కూడా గాయాలపాలయ్యాడు. ఇప్పుడు రోహిత్ శర్మ మనసుని మీరంతా గాయపరుస్తున్నారు. విదేశీ మీడియా ఎప్పుడూ కూడా భారతీయులను తక్కువ చేసి చూడటం, తక్కువ అంచనా వేయడం వారికి అలవాటైపోయిందని విమర్శిస్తున్నారు.
రోహిత్ శర్మ విదేశీ మీడియాను విమర్శించినందుకే ఇలా అగౌరపరుస్తున్నారని కొందరు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఈ విషయంలో తమకేమీ సంబంధం లేదన్నట్టు నోర్మూసుకుని కూర్చున్న బీసీసీఐని కూడా పనిలో పనిగా కొన్ని అంటిస్తున్నారు. దీనంతటికి వీరి అలసత్వం, ఆలస్యమే కారణమని అంటున్నారు.
వీరింత ఆలస్యం చేస్తున్నారంటే, వీరి మనసులో కూడా ఇదే భావన ఉందా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.