Sandeep Vanga: సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ‘అర్జున్ రెడ్డి’ సినిమా. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఊహించని కలెక్షన్లతో బాక్సాఫీసు బద్దలు కొట్టింది. అయితే దీనిపై ఎన్నో ట్రోలింగ్స్ వచ్చినా.. చిత్రం మాత్రం థియేటర్లలో మంచి రెస్పాన్స్తో దూసుకుపోయింది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
ఈ మూవీని మొదటగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో తీయాలనుకున్నట్లు తెలిపారు. 2011లో బన్నీకి ఒక స్టోరీ చెప్పానని.. కానీ, అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని అన్నారు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ కథను ఆయనకు వినిపించాలని ఎంతో ట్రై చేశానని.. చివరకు ఆయన్ని కలవలేకపోయానని చెప్పారు. దీంతో ఆ స్క్రిప్ట్ పట్టుకొని చాలా మంది నటులు, ప్రొడ్యూసర్లను కలిసినట్లు తెలిపారు. అయినా ఎవరూ ఆ స్క్రిప్ట్పై ఆసక్తి చూపించలేదని అన్నారు. ఆఖరికి తానే ఆ చిత్రాన్ని నిర్మించుకున్నట్లు తెలిపారు.
ఇక విజయ్ దేవరకొండ తనకు ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యాడని చెప్పారు. ఆ విధంగా బన్నీని కలవడం కుదరకపోవడంతో విజయ్ దేవరకొండతో సినిమా తీసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత బన్నీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘యానిమల్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తోన్న సందీప్.. తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టారు. పభాస్ హీరోగా ‘స్పిరిట్’ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్తో ఓ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.