Floating Islands : తేలియాడే దీవులను చూశారా? ప్రపంచమంతటా ఇలాంటి దీవులు ఉంటాయి. కానీ మన దేశంలో మాత్రం ఒకే ఒక ప్రాంతంలో వీటిని చూడొచ్చు. ఆ ఐలాండ్స్ చూడటానికి మామూలు దీవుల్లానే ఉంటాయి. ఇళ్లు, జాలర్లు, జంతువులు, పక్షులు అన్నింటినీ ఆ దీవుల్లో చూడొచ్చు. అంటే అక్కడ నివసించేవారు, వారి ఇళ్లు కూడా దీవులతో పాటే నిత్యం నీటిపై తేలియాడుతూ అటూ ఇటూ కదులుతూనే ఉంటాయన్నమాట.
దీవులు ఏమిటి? తేలియాడమేమిటి? అనే సందేహం ఉందా? అయితే కచ్చితంగా మణిపూర్ వెళ్లాల్సిందే. విష్ణుపూర్ జిల్లాలోని లోక్టక్ లేక్లో ఈ తేలియాడే దీవులను చూడొచ్చు. దక్షిణాసియాలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఇది. దేశంలో మరెక్కడా కానరాని రీతిలో.. ఈ లేక్లో తేలియాడే దీవులు బోలెడన్ని కనిపిస్తాయి.
ఫుందీ(Phumdi)లుగా వ్యవహరించే ఈ దీవులు రకరకాల సైజులు, ఆకృతుల్లో ఉంటాయి. ఫుందీ అంటే తేలియాడే బయోమాస్గా చెప్పొచ్చు. మట్టి, సేంద్రియ పదార్థాలు, వ్యర్థాలు కలగలసి ఇలా దీవుల్లా ఏర్పడతాయి. ఫుందీలు చక్కటి పర్యాటక కేంద్రాలుగా మారాయి. ఈ సరస్సులో, దాని చుట్టూ 55 సబర్బన్, రూరల్ సెటిల్ మెంట్స్ ఏర్పడ్డాయి.
ఈ ఫ్లోటింగ్ ఐలాండ్స్ 200 నీటి మొక్కలకు, 400 జీవజాతులకు ఆలవాలంగా మారాయి. అంతరించిపోయే దశలో ఉన్న జింకలను ఈ దీవుల్లో చూడొచ్చు. ఇక్కడ నివసించే జాలర్లు చెక్క పడవులను రవాణా సాధనంగా వినియోగిస్తారు. చేపలవేట, కూరగాయల పెంపకం వీరికి జీవనాధారం. క్యాబేజి, కాలిఫ్లవర్, ఆలుగడ్డ, వంకాయ, బెండకాయ వంటివి పండిస్తారు. లోక్టక్ సరస్సు పొడవు 26 కిలోమీటర్లు, వెడల్పు 13 కిలోమీటర్లు ఉంటుంది. దీని లోతు దాదాపు 3 మీటర్లు. అన్నట్టు ప్రపంచంలో ఏకైక ఫ్లోటింగ్ వెట్లాండ్ పార్కు ఉన్నది ఇక్కడే. జీవవైవిధ్యానికి ఈ పార్కు పెట్టింది పేరు.