పార్లమెంటులో సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనందుకే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టబోతుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగో, ట్యాగ్లైన్ “న్యాయ్ కా హక్ మిల్నే తక్” ను ఖర్గే విడుదల చేశారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర దేశంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై దృష్టి పెడుతుందని మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. ఇండియా కూటమి నాయకులను కూడా ఈ మార్చ్లో పాల్గొనడానికి ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. ఈ వేదిక ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మణిపూర్లో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయన్నారు. దేశ ప్రధాని ఇప్పటి వరకు కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని ఖర్గే విమర్శించారు.
ప్రతిపక్ష నేతలను బెదిరించేందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు ఉపయోగిస్తోందని మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈ నెల 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. 66 రోజుల్లో 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుందని ఖర్గే తెలిపారు. మరోవైపు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్తారా లేదా అని విలేకరులు ప్రశ్నించగా దానిపై ఖర్గే స్పందించారు. ఆలయ ప్రతిష్టాపనకు ఆహ్వానం అందిందని వెల్లడించారు. దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని ఖర్గే చెప్పారు.