Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని ఝబువా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ తాంత్రికుడి ఇనుప గొలుసు దెబ్బలకు తాళలేక 34 ఏళ్ల మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజితకు 15 ఏళ్ల క్రితం ప్రకాష్ దామోర్ అనే వ్యక్తితో పెళ్లయ్యింది. 15 ఏళ్లు గడిచినా ఆమెకు సంతానం కలగకపోవడంతో అత్తమామలు, తల్లిదండ్రులు తమ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న తాంత్రికుడి వద్దకు తీసుకువెళ్లారు.
ఆమెకు దెయ్యం పట్టిందని తాంత్రికుడు భూతవైద్యం మొదలుపెట్టాడు. తంత్ర ప్రక్రియలో భాగంగా ఆమెను ఇనుప గొలుసులతో కొట్టడం మొదలుపెట్టాడు. దెబ్బలు తాళలేక మూడో రోజు మంజిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే మధ్యమార్గంలోనే మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
అయితే మృతదేహంపై కొట్టిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ మరణానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదని వైద్యులు అన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఝబువా ఎస్పీ అగమ్ జైన్ తెలిపారు.