Rahul Gandhi: ఒక సుదీర్ఘ లక్ష్యం కోసం చేపడుతున్న యాత్ర ఇది. భారత దేశ ప్రజల సాధికారత, సామాజిక, ఆర్థిక న్యాయం కోసం తీసుకున్న సంకల్పమిది. అందుకే ఇది భారత్ జోడో న్యాయ్ యాత్ర అయింది. భారత్ జోడో యాత్రతో ఎవరూ చేయని సాహసం చేశారు రాహుల్ గాంధీ. ఆ యాత్రతో దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. స్వయంగా రాహుల్ గాంధీ పొలిటికల్ ఇమేజ్ మరింతగా జనం దగ్గరికి వెళ్లేందుకు ఉపయోగపడింది. ఒక కామన్ మ్యాన్ అందరితో కలిసిపోయిన సాగించిన జర్నీ ఒక చరిత్ర సృష్టించింది. ఇప్పుడు చేపట్టబోయే భారత్ జోడో న్యాయ యాత్ర వెనుక కూడా చాలా అర్థం ఉంది.
రాహుల్ గాంధీ మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఒక ఉజ్వల భవిష్యత్ కు నాంది పలకబోతోంది. ఎక్కడైతే అరాచకం, అణిచివేత మొదలైందో.. అక్కడి నుంచే మార్పు కోసం శ్రీకారం చుట్టబోతున్నారు. అణగారిన వర్గాల గొంతుకై అందరికీ సమన్యాయం అందేలా.. మార్పు కోసం మరో యాత్రకు రాహుల్ రెడీ అయ్యారు. మణిపూర్ హింసలో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ హింసాత్మక ఘటనలు సమస్యలను పెంచాయి. ఒక అభద్రతాభావాన్ని క్రియేట్ చేసింది. అశాంతిని రగల్చింది. విషాదాన్ని మిగిల్చింది. జన జీవితంపై, భవిష్యత్ పై ఆశలు ఆవిరైన అలాంటి చోటి నుంచే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను చేపట్టబోతున్నారు. భవిష్యత్ పై భరోసా ఇస్తూ మణిపూర్ వేదికగా యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.
రాజ్యాంగం ఉన్నత లక్ష్యాలైన సామాజిక, ఆర్థి, రాజకీయ న్యాయంపై విశ్వాసం పెంచేలా రాహుల్ గాంధీ యాత్రలో ప్రస్తావించబోతున్నారు. ప్రజల ఐక్యతకు భంగం కలిగించే మతపరమైన విభజనకు విద్వేషాలకు వ్యతిరేకంగా ఈ యాత్ర జరగబోతోంది. మణిపూర్ వేదికగా మొదలవుతున్న భారత్ జోడో న్యాయ యాత్రలో న్యాయం జరగాలన్నదే మెయిన్ థీమ్ గా కనిపిస్తోంది. మణిపూర్లో ప్రజల హక్కులను కాలరాశారని, ఆకస్మిక హింస చెలరేగినప్పుడు మణిపూర్ ప్రజలను కాపాడడంలో అధికార యంత్రాంగం అంతా విఫలమైందన్న విమర్శ ఉంది. అందుకే మణిపూర్ లో మొదలయ్యే యాత్రకు ప్రజలకు ఓ భరోసా, భవిష్యత్ పై నమ్మకాన్ని, ఆందోళనల నుంచి విముక్తి కలిగించే పాయింట్ ఆఫ్ వ్యూలో కొనసాగబోతోంది. దేశంలో ప్రతి ఒక్కరూ న్యాయం పొందేందుకు, గౌరవప్రదంగా బతికేందుకు అర్హులు అనే భావనను బలపరిచడమే రాహుల్ రెండో విడత యాత్ర ఉద్దేశం.
కేంద్ర ప్రభుత్వ అరాచకాలకు, నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా భారత్ జోడో న్యాయ యాత్ర జరగబోతోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ద్రవ్యోల్బణం పెరగడం, నిరుద్యోగం సమస్యగా మారడం వంటి వాటిపై పోరాటం కొనసాగుతుందంటున్నారు. భారత్ జోడో యాత్ర తొలి విడతలో కవర్ కాని రాష్ట్రాల మీదుగా ఇప్పుడు చేపట్టబోయే యాత్ర మరో సంచలనం అవుతుందంటున్నారు.
ప్రజలు కోరుకుంటున్న కావాలనుకుంటున్న ఉద్దేశాల ప్రకారమే భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో కాంగ్రెస్ శ్రీకారం చుడుతోంది. ఈ యాత్ర ద్వారా తమకు మేలు జరుగుతుందుకుంటున్న వారు చాలానే ఉంటారు. ఆచరణలో ప్రపంచవ్యాప్తంగా పాలనపై ప్రభావం చూపే సామాజిక, రాజకీయ శక్తులను న్యాయం అనే ఆలోచన చాలా ఎఫెక్ట్ చూపుతుంది. అందుకే ఈ థీమ్ ఆధారంగా రాహుల్ యాత్ర ఉండబోతోంది. శాంతి అన్నది ఘర్షణ నుంచి విముక్తి కాదని, అయితే న్యాయంగా జీవించడం ద్వారా సాధ్యమవుతుందని మహాత్మాగాంధీ చెప్పినట్లుగా.. ఇప్పుడు రాహుల్ చేపట్టబోయే భారత్ జోడో న్యాయ యాత్ర ప్రజా వాదానికి ఒక రూపంగా మారుతుందన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు చేరువయ్యే మార్గంగా చూస్తున్నారు హస్తం నేతలు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా న్యాయం పొందేందుకు రాజ్యాంగబద్ధమైన హక్కు గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం. ఆపై ప్రజాస్వామ్య మార్గాల ద్వారా ఆచరణ చేపట్టేలా చూడడం మరో కీలకమైన అంశం.
కొత్త భారత్ ను సరికొత్తగా ఆవిష్కరించేందుకు అవసరమైన లక్ష్యాల సాధన దిశగా భారత జోడో న్యాయ యాత్ర ఉపయోగపడనుంది. తీవ్రమవుతున్న అసమానతలతో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం రోజురోజుకూ తగ్గిపోతోంది. నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం లక్షలాది మంది జనానికి అన్యాయం చేసేలా పరిస్థితులను తీసుకొచ్చింది. ముఖ్యంగా యువత అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. మరోవైపు చట్టసభల్లో ప్రశ్నించే పరిస్థితులు కూడా రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. శాంతియుత నిరసనలకు చోటు లేదు అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. పార్లమెంట్ భద్రత గురించి ప్రశ్నించి, కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలన్న ఎంపీల డిమాండ్ ను తోసిపుచ్చుతూ 146 మంది ఇటీవలే సభ నుంచి సస్పెండ్ కూడా చేశారు. పార్లమెంట్ భద్రతపై సమాధానం ఇచ్చే జవాబుదారీ తనం ప్రభుత్వానికి లేకపోవడం కూడా మిగితా సభ్యులకు ఒకరకమైన అన్యాయమే.
ఇలా అన్ని దశల్లోనూ ఎదురవుతున్న అన్యాయాన్ని ఎదురించేలా, అన్యాయాన్ని ప్రశ్నించేలా, జనానికి భరోసా ఇచ్చేలా.. ఇప్పుడు రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో న్యాయ యాత్ర ఉపయోగపడుతుందంటున్నారు హస్తం నేతలు. ఒక పరిష్కారం తీసుకొచ్చేలా, జనంలో ఆలోచన రేకెత్తించేలా, స్వేచ్ఛగా ఉండేలా.. ఆహార, ఉద్యోగ భద్రత కలిగేలా, అణగారిన వర్గాలు తల ఎత్తుకునేలా ఇలా అన్ని అంశాలను స్పశిస్తూ న్యాయ యాత్ర జరగనుంది.
.
.