Gudivada Amarnath : ఆ మంత్రి సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తుడు.. సన్నిహితుడు కూడా. జగన్ కోసమే పుట్టినట్టు మాట్లాడుతుంటారు. ప్రతిపక్షాలను చీల్చి చెండాడుతారు. పవన్ కళ్యాణ్ మీద అయితే ఒంటి కాలుమీద లెగుస్తారు. ఆ వాగ్దాటితోనే జగన్ గుడ్ లుక్స్లో పడి మినిస్టర్ అయిపోయారు. దాంతో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిపోయాయో? ఏమో? నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోవడం మానేశారు. అదే చివరకు ఆయనకు నెగిటివ్ అయిందంట. మంత్రి స్థాయిలో ఉంది సిట్టింగ్ సీటు పోగొట్టుకుని బొక్కబోర్లా పడ్డారు. దాంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై పెద్ద చర్చే నడుస్తోంది.
అనకాపల్లి ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ నాయకుల్లో యంగ్ అండ్ డైనిమిక్. మాటలతోనే కాదు తన స్టెప్పులతో కూడా అందరిని మురిపిస్తూ, మరిపిస్తూ అనతి కాలంలోనే మంత్రిగా ఎదిగిన నాయకుడు. అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పని చేశారు. గురునాధరావు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గుడివాడ అమర్నాథ్ మొదట టీడీపీలో కార్పొరేటర్ గా గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాకు వైసీపీ అధ్యక్షుడిగా జగన్, నమ్మిన వ్యక్తిగా, సన్నిహితుడిగా మారారు. రైల్వే జోన్ కోసం పాదయాత్ర అంటూ హడావుడి చేసి పార్టీలో ఇమేజ్ పెంచుకున్నారు. ఆ క్రమంలో 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి తన నోటికి పని చెప్పడం మొదలుపెట్టారు. కాపు సామాజికవర్గం నుండి వచ్చిన నాయకుడు కావడంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలతో నిత్యం వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. సీఎం జగన్ ను విమర్శించిన ప్రతి ఒక్కరిని తన మాటలతో చీల్చి చెండాడి అధినేత వద్ద మంచి మార్కులు కొట్టేశారు. అందుకే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్లందర్నీ వెనక్కినెట్టి మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కించుకుని. అత్యంత కీలకమైన ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన మాటలతో ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేసే అమర్నాథ్ మంత్రిగా అనవసరమైన వ్యాఖ్యలు చేసి ట్రోల్ అవుతూ ఇంకో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ కి గండి పడే పరిస్థితి వచ్చే సరికి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వైసీపీ అధినేత వచ్చే ఎన్నికల కోసం గెలుపుగుర్రాల పేరుతో కొత్త వాళ్ళను దించుతూ మంత్రి అమర్నాథ్కు మొండి చెయ్యి చూపించారు. సిట్టింగుల సీట్లు మారుస్తున్నారు అని తెలిసిన రోజు నుండి మంత్రి అమర్నాధ్ తనకు సీటు వచ్చినా రాకపోయినా సీఎం జగన్ ఆదేశించిన పని చేసుకుంటానని, జెండాలు మోసే కార్యకర్తగా ఉంటానని ప్రకటనలు చేస్తూనే వచ్చారు.
తనకు సీటు రాదనీ ముందే తెలుసేమో? అందుకే ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని అనుకున్నారు నియోజకవర్గం ప్రజలు అనుకున్నట్లుగానే వైసీపీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. చావు కబురు చల్లగా చెప్పినట్లు సీటు లేదని చెప్పేశారు. అసలు ఈ దేశంలోనే ఉండని ఓ కొత్త వ్యక్తిని మలసాల భరత్కుమార్ని నియోజకవర్గం ఇన్చార్జ్గా ప్రకటించారు. మంత్రి అమర్నాథ్ కు చేసేది లేక పార్టీ అధినేతను ఏమి అనలేక, భాధను బయటకు కక్కలేక కన్నీటి పర్యంతరం అవుతున్నారు.
అసలు మంత్రి అమర్నాథ్కు సీటు రాకపోవడానికి కారణాలు ఏంటని గమనిస్తే ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి మంత్రిగా ఉన్న ఈరోజు వరకు అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి అంగుళం కూడా ముందుకు జరగలేదు. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని చివరకు మంత్రి అయిన ఈ రెండేళ్లలో కనీసం రోడ్లు కూడా వేయించలేకపోవడంతో ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానికి తోడు తన సొంత అభివృద్ధి, ఆయన పాటు తిరిగే కేవలం మరో 20 మంది అనుచరులు మాత్రమే బాగుపడ్డారన్న విమర్శు బాహాటంగానే వినిపిస్తున్నాయి. గడపగడపకు కార్యక్రమం కానీ, ఏ ఇతర ప్రభుత్వ కార్యక్రమం అయినా మాటలతో తప్ప చేతలతో చేయలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో జగన్ చేయించుకున్న అన్ని సర్వే రిపోర్టులు అమర్నాథ్కు వ్యతిరేకంగానే వచ్చాయంట. దాంతో ఆయన సీటు గల్లంతైంది
ఇక మంత్రి అమర్నాథ్ రాజకీయ భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి ఎమ్మెల్యే సీటు కోల్పోయినా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని లేదా చోడవరం సీటు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దానికి తగ్గట్లే అమర్నాథ్ కూడా సీటు కోల్పోయినా పార్టీ అధినేతపై కానీ పార్టీపై కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మరోవైపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే అమర్నాథ్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారు అంటూ కొత్తగా మరో ప్రచారం మొదలైంది. ఏది ఎలా ఉన్నా ఆయన జగన్కు వీరవిధేయుడిగానే కొనసాగుతారా? ప్రత్యామ్నాయం చూసుకుంటారా? అనేది చూడాలి.
.
.