YCP leaders Third List Tension : ఫస్ట్ లిస్టులో 11 నియోజకవర్గాలు, సెకండ్ లిస్ట్లో 27 సెగ్మెంట్ల ఇన్చార్జ్లను ప్రకటించింది వైసీపీ. వాటిలో కొందరు ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల సీట్లు గల్లంతైతే.. కొందరు పోటీ చేసే నియోజకవర్గాలు మారిపోయాయి. దాంతో సహజంగానే పార్టీలో అసంతృప్తి స్వరాలు పెరిగిపోయాయి. ఆ క్రమంలో ఇప్పుడు మూడో జాబితా అంటుండటంతో అధికార పార్టీలో సిట్టింగుల్లో ఆందోళన పెరిగిపోతోంది. థర్డ్ లిస్ట్లో ఎవరి సీట్లకు ఎసరు వస్తుందో? ఎవరెవరి నియోజకవర్గాలు మారిపోతాయో అని బెంబేలెత్తిపోతున్నారు సిట్టింగులు, ఇన్చార్జ్లు.
ఏపీలో మరోసారి అధికారం చేపట్టడానికి వైసీపీ చేస్తున్న కసరత్తు ఆ పార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. వైసీపీ అధినేత జగన్ ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారన్న పేరుతో సిట్టింగ్ ప్రజాప్రతినిధులను, నియోజకవర్గాల ఇన్చార్జ్లను మార్చేస్తున్నారు. మరి కొందరికి స్థానచలనం కల్పిస్తున్నారు. ఇప్పటికే రెండు దశలలో 38 నియోజకవర్గాల్లో అభ్యర్థులను వైసీపీ అధిష్టానం మార్చేసింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల పొత్తు ఖరారవ్వడంతో వైసీపీ మరింత జాగ్రత్తపడుతోంది. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించిన జగన్ దానికి తగ్గట్లు కసరత్తు మొదలుపెట్టారు. చాలా వరకు సిట్టింగ్లకు మొండి చేయి చూపుతున్నారు. దీంతో నేతలు అలకబూనుతూ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు.
మూడో లిస్ట్లో మరో 15 నుంచి 25 మందిని మార్చనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మొదటి రెండు జాబితాల్లో 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక సిట్టింగ్ ఎంపీకి అధిష్టానం నియోజకవర్గాలు కేటాయించకుండా పక్కన పెట్టేసింది. అందులో కొందరు మంత్రులు, సీనియర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదే అంశం వైసీపీ నేతలలో ఆందోళన కలిగిస్తుంది. మూడో జాబితా ఎప్పుడు రిలీజ్ కాబోతుందో అందులో ఎవరెవరికి మార్పులు చేయనున్నారో? ఎవరెవరికి నియోజకవర్గాలు కేటాయించకుండా పక్కన పెడతారో అన్న ఆందోళన నేతల్లో ఎక్కువైపోతుంది.
తనకు సన్నిహితులుగా పేరున్న వారి టికెట్లు కూడా చించేస్తున్నారు జగన్. ఆ క్రమంలో థర్డ్ లిస్ట్తో మరికొందరి భవితవ్యం త్రిశంకు స్వర్గంలో పడనుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తాడేపల్లి నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు ఉలిక్కిపడుతున్నారంట. అయితే ఫోన్ రింగ్ అయితే చాలు సీఎంఓ నుంచి కాదు కదా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్నారంట. అంతేకాదు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంపీకి ఫోన్ చేసి మరీ మీకు ఫోన్ వచ్చిందా అని అడిగి తెలుసుకుంటున్నారట. నాకు ఫోన్ వస్తే మీకు చెప్తాను.. మీకు ఫోన్ వస్తే చెప్పండి అని పురమాయించుకుంటున్నారంట.
రోజుల వ్యవధిలో మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. మూడో జాబితాలో కూడా కొంతమంది సిట్టింగ్ల మెడపై కత్తివేలాడుతుందనే ప్రచారం జరుగుతోంది. అలాగే పలువురుకి స్థానచలనం కూడా ఉందని తెలుస్తోంది. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనితకు సైతం స్థానచలనం కలిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆమెతోపాటుగా సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మంత్రి దాడిశెట్టి రాజా కూడా స్థాన చలనం తప్పదంటున్నారు. అలానే నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జగ్గయ్యపేట సాదినేని ఉదయభాను, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిలను మారుస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
మెుత్తానికి వైసీపీ అధిష్టానం అభ్యర్థుల ఎంపిక విషయంలో సిట్టింగ్లకు చుక్కలు చూపిస్తోంది. ఒకపక్క సిట్టింగుల్లో ఆందోళన. మరోపక్క కొత్త అభ్యర్థులు ఆశలతో మూడో లిస్ట్ కోసం నేతలు ఎదురుచూస్తున్నారు.
.
.