Kapu Ramachandra Reddy : వైసీపీకి మరో ఎమ్మెల్యే షాకిచ్చారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీని వీడుతున్నానని ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ను కలిసేందుకు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి కాపు రామచంద్రారెడ్డి వచ్చారు. కానీ కలిసేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు.
తనకు టిక్కెట్ ఇవ్వడంలేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జగన్ను నమ్మి కాంగ్రెస్ నుంచి వచ్చానన్నారు. మంత్రి పదవి ఇస్తామన్న మాట తప్పారని మండిపడ్డారు. పార్టీ కోసం గడప గడపకూ తిరిగానని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ చెప్పిన ప్రతి పని చేశానన్నారు. సర్వే పేరు చెప్పి టిక్కెట్ నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సీటు ఇవ్వకపోవడం బాధగా ఉందన్నారు.
తమ కుటుంబం వైసీపీని వీడుతుందని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కల్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన భార్య ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తామన్నారు. వైసీపీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగనే తమ సర్వస్వం అనుకుంటే జీవితాలు సర్వనాశనం అయ్యాయని కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
.
.