kannappa: మంచు విష్ణుకు హిట్లు లేక చాలా రోజులు అయింది. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘కన్నప్ప’ మూవీపైనే ఉన్నాయి. ‘మహాభరత్’ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ మోడల్ ప్రీతి ముకుందన్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రభాస్, మోహన్లాల్, శివరాజ్కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఓ నాస్తికుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారాడదన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే మూవీ యూనిట్ న్యూజిలాండ్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది. 90 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో 600 మంది హాలీవుడ్ నిపుణులు వర్క్ చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి ‘కన్నప్ప’ టీమ్ సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ చిత్రం ద్వారా మంచు కుటుంబం నుంచి మరొకరు వెండితెరకు పరిచయం అవుతున్నట్లు తెలిపింది. మోహన్ బాబు మనవడు.. మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ ‘కన్నప్ప’ మూవీతో తెరంగేట్రం చేయనున్నట్లు పేర్కొంది. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ.. మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
ఈ మేరకు తన కుమారుడి సినీరంగ ప్రవేశాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘ఒక కొత్త తరాన్ని వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా కుటుంబం నుంచి మరో తరం మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమైంది. మా కుటుంబ కీర్తిని అవ్రామ్ మరింత ముందుకు తీసుకెళ్లనున్నాడు’’ అంటూ విష్ణు రాసుకొచ్చారు.