Pawan kalyan : ఆస్తులు దోచుకోవడానికే సమగ్ర భూరక్ష చట్టం తీసుకొచ్చారని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. రెవెన్యూ అధికారులు సహయంతో భూములను దోచుకోవడానికే సమగ్ర భూరక్ష చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం రూపొందించిందని విమర్శించారు.
గుంటూరు, విజయవాడ బార్ అసోసియేషన్ల న్యాయవాదులు శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యారు. సమగ్ర భూరక్ష చట్టంలో ఉన్న లోపాలపై న్యాయవాదులతో చర్చించారు పవన్ కళ్యాణ్. సమగ్ర భూరక్ష చట్టం వల్ల న్యాయవాదులకు కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
జగన్ విశాఖలో నగరంలో ఆస్తులను దోచుకోవాడినికే ఈ చట్టం తెచ్చారని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఈ చట్టం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. కోర్టు నుంచి న్యాయరక్షణ పొందవచ్చనే అంశాన్ని ఈ చట్టం నుంచి తొలగించారన్నారు. ప్రజల భూమిపై ప్రభుత్వానికి హక్కు ఏమిటి అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు నుంచి న్యాయవాదుల వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న న్యాయవాదులకు పూర్తిగా తన సహకారం ఉంటుందని ప్రకటించారు. ఆస్తి పత్రాలపై జగన్ బొమ్మ ఉండటం ఏంటని? ప్రశ్నించారు. ఈ చట్టం వల్ల భూ హక్కులు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు. ఈ చట్టంపై మరింతగా అధ్యయనం చేస్తామన్నారు. ఈ చట్టంపై అందరికి అవగాహన పెంపొందిచటానికి మరింత సమయం కావాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.