Chevella Lok Sabha Constituency : చేవెళ్ల లోక్సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు బయటపడింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ 17 లోకసభ స్థానాలకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడే సమయంలో ఎమ్మెల్యే వర్గం నినాదాలు చేసింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న మాజీ మంత్రి హరీశ్రావు కలగజేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పారు. దీంతో ఇరువర్గాలు శాంతించాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి అప్పటి టీఆర్ఎస్ పార్టీ తరఫున తాండూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి తాండూరులో పోటీ చేసి పట్నం మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ ఫిరాయించి రోహిత్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. అప్పటి నుంచి తాండూర్ బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు నడుస్తోంది. 2023 ఎన్నికలకు మూడు నెలల ముందు మహేందర్ రెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టారు కేసీఆర్.
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మహేందర్ రెడ్డిని కాదని పార్టీ ఫిరాయించిన రోహిత్ రెడ్డికి బీ ఫామ్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది మనోహర్ రెడ్డి చేతిలో 6583 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అటు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోడంతో మహేందర్ రెడ్డి చేవెళ్ల లోక్సభ స్థానంపై కన్నేశారు. అటు ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో రోహిత్ రెడ్డి కూడా చేవెళ్ల లోక్సభ స్థానాన్ని ఆశిస్తున్నారు. దీంతో వారిద్దరి మధ్య పోటీ నెలకొంది. తాజాగా పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలలో వర్గపోరు మరోసారి బయటపడింది.
చేవెళ్ల లోక్సభ స్థానం కోసం సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఎవరికి ఇస్తుందో వేచి చూడాల్సిందే!