Tirumala Laddu’s To Ayodhya : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న ఈ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూలను అయోధ్యకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష లడ్డూలు పంపిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయుల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈ విషయాలను వెల్లడించారు. ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు ఉంటుందని తెలిపారు.
టీటీడీ చేపడుతున్న ఇతర కార్యక్రమాలను ఈవో ధర్మారెడ్డి వివరించారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు నిర్వహించే ఈ సదస్సుకు దేశంలో ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని పేర్కొన్నారు.
నకిలీ వెబ్సైట్లపైనా భక్తులను టీటీడీ ఈవో అప్రమత్తం చేశారు. అలాంటి వెబ్ సైట్ల వల్ల మోసపోకూడదని సూచనలు చేశారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలన్నారు. ధనుర్మాస కార్యక్రమాల ముగింపు ఉత్సవాలను వివరాలను వెల్లడించారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో జనవరి 15న ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆ రోజు సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు శ్రీగోదా కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. జనవరి 16న కనుమ రోజు శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.