Tirumalagiri Crime: కన్నతల్లినే గొడ్డలితో నరికి చంపి కడతేర్చాడో దుర్మార్గుడు. కని పెంచిన పాపానికి.. తల్లినే పొట్టనపెట్టుకున్నాడు. ఏమైందో ఏమో కనీస మానవత్వం కూడా లేకుండా.. అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో జరిగింది. రాజారెడ్డి.. తన తల్లిని చంపేందుకు వెళ్తుండగా అడ్డొచ్చిన జ్యోతి అనే మహిళపై కూడా గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన జ్యోతిని ఆస్పత్రికి తరలించారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచరకుంట్ల రాజు (40) అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండేవాడు. గురువారం అర్థరాత్రి 1 గంట సమయంలో కన్నతల్లిని విచక్షణా రహితంగా గొడలితో నరికిచంపాడు. ఆమె ఆర్తనాదాలు విన్న పక్కింటి మహిళ.. అతడికి అడ్డు తగిలింది. ఆమెపై కూడా రాజు గొడ్డలితో దాడిచేశాడు. తలపై గొడ్డలితో నరికేశాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఇరుగు పొరుగు వారు తీవ్రంగా గాయపడిన మహిళను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు రాజు.. గొడలితో ఊర్లో వాళ్లని బెదిరించి.. పారిపోతూ ఒంటరిగా ఉన్నవారిపై దాడికి యత్నించాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. రంగంలోకి దిగి రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నకోడేపాక గ్రామస్తులు రాజుని పట్టుకుని కట్టేయగా.. పోలీసులు అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒంటరిగా ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు గ్రామస్తులను హెచ్చరించారు. దీంతో తిరుమలగిరి గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.