kim Jong : ఉత్తరకొరియాకు నవ సారథ్యం రానుందా? సుప్రీం నేత కిమ్ జోంగ్ ఉన్ చిన్న కూతురు కిమ్ జో ఐ (Kim Ju Ae)కి వారసత్వ పగ్గాలు చిక్కనున్నాయా? అంటే అవుననే అంటోంది ఆ దేశ నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్(NIS). కిమ్ జోంగ్ వారసురాలిగా ఆయన గారాలపట్టి జో ఐ కే ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతోంది. కిమ్ ఆరోగ్యం బాగోలేదని ఇటీవల ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో నాయకత్వ మార్పు వార్తల్లో నిజం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.
జో ఐ 2022 నవంబర్ నెలలో తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా జో ఐ బహిరంగ దర్శనమిచ్చింది. గత నెలలో ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన సమయంలో ఆమె తండ్రి వెన్నంటే ఉంది. అంతకుముందు నవంబర్లో నిఘా ఉపగ్రహం మన్నియంగ్-1 ప్రయోగసమయంలోనూ జో ఐ ప్రజల ముందుకు వచ్చింది.
నిరుడు ఆమెను వెంటబెట్టుకుని కిమ్ పలు సైనిక కవాతుల్లో పాల్గొనడంతో పాటు ప్రజల్లోకి రావడానికి కారణం లేకపోలేదు. పూర్తి స్థాయిలో వారసత్వ పగ్గాలు చేపట్టడానికి ముందు జో ఐని ప్రజలకు పరోక్షంగా పరిచయం చేయడమే అని పరిశీలకులు భావిస్తున్నారు. కిమ్ ముగ్గురు సంతానంలో ఆమే చిన్నదని తెలుస్తోంది.
జో ఐ ఎవరనేది తొలిసారిగా 2013లో వెల్లడైంది. ఆమె కిమ్ కూతురంటూ బాస్కెట్ బాల్ మాజీ స్టార్ డెన్నిస్ రోడ్మన్ ఆ వివరాలను బహిర్గతపరిచారు. 2022లో నవంబర్ వరకు ఆమె బయట ఎక్కడా, ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు. పాంగ్ యాంగ్లో క్షిపణి పరీక్ష సందర్భంగా తల్లి రిసాల్ జూ తో కలిసి ఆ నెలలో తొలిసారి ప్రజల ముందుకు వచ్చింది.
కిమ్ వారసురాలిగా జో ఐ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఎన్ఐఎస్ చెబుతోంది. ఉత్తరకొరియాలో 1999 నుంచి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే లోకల్ ఎలక్షన్లలో దేశ నేత ఎవరన్నదీ తేలదు. దేశ నాయకత్వం పార్లమెంటరీ ఎన్నికల ద్వారా ఖరారు అవుతుంది. వాస్తవానికి ఉత్తర కొరియా ఏర్పడిన 1948వ సంవత్సరం నుంచీ కిమ్ కుటుంబమే పరిపాలిస్తోంది.
కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ ఉత్తర కొరియా తొలి సుప్రీం నేత. ఇక కిమ్ తప్పుకుంటే నాలుగో తరం పగ్గాలు చేపడుతుంది. ఉత్తర కొరియా అంటేనే కిమ్ కుటుంబ ఆధిపత్య దేశం. ఆ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తులెవరైనా నాయకత్వ పగ్గాలు చేపడితే మాత్రం అది ఆశ్చర్యకరమైన అంశమే.