ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. పార్టీ అధినేతలు అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు తమ నేతలపట్ల ఉన్న వ్యతిరేకతను బేరీజు వేసుకుంటూ కూరలో కరివేపాకులా పక్కన పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ ఎంపీ కేశినేని నానిని పార్లమెంట్ ఎన్నికల బరి నుంచి తప్పించారు. దీంతో నాని నెక్ట్స్ స్టెప్ ఏంటి..?, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండనుందన్నది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.
గత కొన్నాళ్లుగా కేశినేని బ్రదర్స్ వివాదంతో విజయవాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇటీవలే తిరువూరులో ఇరువురి వర్గాల దాడులతో పార్టీ కార్యాలయం రణరంగంగా మారింది. ఈ తరుణంలోనే చంద్రబాబు తమ్ముడు చిన్నిని ఎంకరేజ్ చేస్తూ.. అన్న నానికి షాక్ ఇచ్చారు. తర్వలో జరిగే పార్లమెంట్ ఎన్నికల బరి నుంచి తనను తప్పిస్తున్నట్టు సమాచారం అందజేసింది టీడీపీ హైకమాండ్. ఈ విషయంపై స్పందించిన నాని.. అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని శిరసావహిస్తానని తెలిపారు. అయితే.. ఇప్పటికి నాని మౌనంగా ఉన్నా.. తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. రెండుసార్లు ఎంపీగా చేసిన అతడిని పార్టీ ఎందుకు పక్కకు పెట్టిందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎంపీ సీటు రాదని ఖయమైపోయింది కాబట్టి పార్టీ మారే యోచనలో ఉన్నారా అన్న అనుమానం కూడా కలుగుతోంది.
మరోవైపు విజయవాడ ఎంపీ సీటు వ్యవహారంలో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు తెరపైకి వచ్చింది. టీడీపీ, బీజేపీతో పొత్తు ఉంటే సుజనా చౌదరి బరిలో దిగే యోచనలో ఉన్నారు. ఒకవేళ పొత్తులు ఖరారు కాకపోతే బీజేపీ నుంచి మళ్లీ టీడీపీలోకి జంప్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహరంపై ఇప్పటికే ఢిల్లీ వేదికగా టీడీపీ ముఖ్య నేతలకు సుజనా సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. బీజేపీ తీరుపై అసంతృప్తితో ఉన్న సుజనా చౌదరి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంపీ సీటు కోసం వేచి చూసిన కేశినాని కూడా ఇందుకు ఒప్పుకున్నారని.. ఆయనే సుజనాచౌదరికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారని సమాచారం. సుజనాకు ఇవ్వకపోతే తనకే ఆ సీటు ఖాయం చేయాలని చెప్పారట కేశినాని. అయితే.. ఈ వ్యవహారం గురించి సంక్రాంతికి చర్చించి అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబు.
.
.