Municipal Workers Protest: ఆంధ్రప్రదేశ్ లో పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె బాట పట్టారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చేస్తున్న ఈ నిరవధిక సమ్మె నేటితో 11వ రోజుకు చేరుకుంది. దీంతో ఏపీలో రోడ్లన్నీ ఎక్కడికక్కడ చెత్త పేరుకుబోయి దర్శనం ఇస్తున్నాయి. ఈ ఆందోళనల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. ఇప్పుడు ఈ చెత్త కారణంగా అనారోగ్యం పాలవుతామని ప్రజలు వాపోతున్నారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ నిరసనల నేపధ్యంలో.. అధికారులు ప్రైవేట్ సిబ్బందితో చెత్త తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పారిశుద్ధ్య కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు.. చెత్త తరలించే వాహనాలకు అడ్డుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు.. పారిశుద్ధ్య కార్మికులకు మధ్య పలు నగరాల్లో తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నిరసనకు ప్రజాసంఘాలు కూడా మద్దతు తెలుపుతుండడంతో రానున్న రోజుల్లో మరింత ఉధృతం కానున్నట్లు భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం గత పది రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ.. ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తమ డిమాండ్ల సాధనకు పారిశుద్ధ్య కార్మికులు రోజురోజుకు సమ్మె ఉద్ధృతం చేస్తుండడంతో.. అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని అంటున్నారు. సమ్మెలో పాల్గొన్న వారికి జీతాలు చెల్లించేది లేదని వారికి తాఖీదులిస్తున్నారు. పలు చోట్ల నోటీసులను తీసుకునేందుకు కార్మికులు విముఖత చూపడంతో.. అధికారులు వారి ఇళ్లకు వెళ్లి వాటిని అతికిస్తున్నారని సమాచారం అందుతుంది. అలానే పుర, నగరపాలక సంస్థ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతూ.. ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.