Pawan Letter: వైపీపీ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తూ జనసేన అధినేత పవన్కల్యాణ్ కాపు నేతలకు లేఖ రాశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి కళ్లెదుటే కనిస్తోందని.. అందుకే కొందరు కాపు పెద్దలను రొచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు పవన్. తాను గౌరవించే కాపు పెద్దలు దూషించినా కూడా దీవెనలుగానే స్వీకరిస్తానని తెలిపారు. తనను ఎంతగా దూషించినా వారి కోసం జనసేన వాకిలి తెరిచే ఉంటుందని లేఖ ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా జగన్ సర్కార్పై మండిపడ్డ ఆయన కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పి.. వారినే పావులుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తిని ముందుగా ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు. కుట్రలు, కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో కాపు పెద్దలెవరూ చిక్కుకోవద్దనేదే తన విన్నమన్నారు పవన్కల్యాణ్. అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్ధిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండటంతో వైసీపీకి జీర్ణం కావడం లేదని.. అందుకే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోందని ఆయన నిప్పులు చెరిగారు.
కాపులను కాపు నాయకులతో తిట్టిస్తూ.. తూలనాడిస్తున్న వ్యక్తిని కాకుండా నన్ను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలన్నారు సేనాని. తాను ఇంకా శాసన సభలోకి అడుగుపెట్టలేదని తెలిపిన ఆయన.. తనతోపాటు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లే రాజకీయ ప్రస్థానంలో తన ముందరి కాళ్ళకు బంధాలు వేయించాలని చూస్తున్నది ఎవరో ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని.. తాను గౌరవించే కాపు పెద్దలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నానంటూ లేఖలో విన్నవించారు పవన్కల్యాణ్.
.
.