TSRTC : తెలంగాణ ఆర్టీసీలో మోగాల్సిన సమ్మె సైరన్ను సైలెంట్ చేసేశారు అధికారులు. శుక్రవారం నుంచి ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్ల సమ్మె పిలుపును వెనక్కి తీసుకున్నారు. వారితో ఇవాళ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చర్చలు నిర్వహించారు. అవి సఫలమయ్యాయి. దీంతో యధావిధిగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. యజమానుల సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
తాము ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నారని అద్దె బస్సు యజమానులు తెలిపారు. తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మహిళలు భారీ స్థాయిలో బస్సులను ఎక్కుతున్నారు. దీనివల్ల ఓవర్ లోడ్ అయ్యి అదనంగా 15 లీటర్ల డీజల్ ఖర్చు అవుతుందనేది అద్దె బస్సు యజమానుల మాట. అంతే కాకుండా అధిక లోడ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వర్తించదని గతం లో రూల్ ఉంది. ఇవన్నీ సవరించాలి అంటూ అద్దె బస్సు ఓనర్లు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ఆర్టీసీ సానుకూలంగా స్పందించిందని చెబుతున్నారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో సమావేశం అయ్యి ఈ సమస్యలపై చర్చించారు. వారం రోజుల్లో అంటే ఈ నెల 10లోపు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 2 వేల 700 అద్దె బస్సులు శుక్రవారం నుంచి యథావిధిగా పరుగులు పెట్టనున్నాయి. సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా తిప్పబోతున్నామన్నారు.