US East Coast : అమెరికా అట్లాంటిక్ తీరంలోని భారీ కట్టడాలు కుంగిపోతున్నాయి. న్యూయార్క్, బాల్టిమోర్, నార్ఫోక్ తదితర మహానగరాల్లో సగానికిపైగా కట్టడాలు ఇదే ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2100 నాటికి ప్రపంచంలోని గ్లేసియర్లలో 40 శాతానికి పైగా మాయమవుతాయని నాసా అంచనా. అంటే అవి కరిగిపోవడం ద్వారా సముద్రమట్టాలు 9 సెంటీమీటర్లు పెరిగే ప్రమాదం ఉంది.
తాజా పరిశోధనల ప్రకారం సముద్రనీటిమట్టాల పెరుగుదలతో అమెరికా తూర్పు తీర నగరాలను నీరు ముంచెత్తడమే కాకుండా భూమి కుంగుబాటు సమస్యను కూడా ఎదుర్కొంటున్నాయని తెలుస్తోంది. తీరనగరాల్లో భూమి ఏ మేర కుంగుబాటుకు లోనవుతున్నదన్న అంశంపై ఆ పరిశోధన ప్రధానంగా దృష్టి సారించింది. న్యూయార్క్ వంటి మహానగరాలు కుంగిపోయే ప్రమాదం, తీర ప్రాంత ప్రజలపై దాని పర్యవసానాలు వంటివి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
తుఫాన్లు, ముంపు వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్న ప్రధాన తీర నగరాలకు తాజాగా కుంగుబాటు ముప్పు మరో ప్రధాన సవాల్ కానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2 వేల నుంచి 74 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో 14 కోట్ల జనాభాతో ఉన్న నగరాలు ఏటా 1-2 మిల్లీమీటర్లు కుంగిపోతున్నట్టు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
న్యూయార్క్, బాల్టిమోర్, నార్పోక్ వంటి నగరాల్లో దాదాపు 50 శాతం కట్టడాలకు ఈ కుంగుబాటు ముప్పు తప్పదని హెచ్చరించారు. అమెరికా అట్లాంటిక్ తీరం 5 మిల్లీమీటర్ల చొప్పున ఏటా కుంగిపోతోందని తెలిపారు. 2 మిల్లీమీటర్ల కుంగుబాటు ప్రభావం 21 లక్షల మందిపై, 8.67 లక్షల కట్టడాలపై ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. రాడార్ డేటాసెట్ల ఆధారంగా ఈ పరిశోధన సాగింది.