IND Vs PAK T20 : ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల్లో ఏ జట్టు ఏ దేశం మీద ఆడినా పెద్ద ఫరక్ పడదు గానీ పాకిస్తాన్-ఇండియా మధ్య జరిగిందంటే మాత్రం ఆ కిక్కే వేరబ్బా.. అనే లెవల్లో ఉంటుంది. అది కూడా ఐసీసీ ట్రోఫీ టీ 20 ప్రపంచ కప్ లో తలపడితే ఎలా ఉంటుంది? ఆ హీట్ ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటి గ్రేట్ మ్యాచ్ మరొక్కసారి రిపీట్ కానుంది.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నటీ 20 వరల్డ్ కప్ లో జరిగే మ్యాచ్ ల వేదికలు, తేదీలను నిర్ణయిస్తున్నారు. ఇప్పటికే ఐసీసీ అధికారులు ఆ దేశాల్లో పర్యటించి షెడ్యూల్కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ గ్రూప్ లో ఉన్న నాలుగు టీమ్ లతో మ్యాచ్ల తేదీలు ఖరారు చేసినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు గానీ, ప్రాథమికంగా మాత్రం ఒకటని అనుకుంటున్నారు.
బహుశా అవే ఫైనల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండియా ఆడే మ్యాచ్ ల తేదీలు ఇలా ఉన్నాయి. 2024 జూన్ 5న ఐర్లాండ్, జూన్ 9న పాకిస్థాన్, జూన్ 12న అమెరికా, జూన్ 15న కెనడా దేశాలతో టీమిండియా ఆడనుంది. భారత్ ఆడే నాలుగు మ్యాచ్ లు కూడా యూఎస్ఏ వేదికగానే జరగనున్నాయి.
ఇకపోతే భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ న్యూయర్క్లోని ఐసెన్హోవర్ పార్క్ వేదికగా జరిగే అవకాశాలున్నాయి. ఈ స్టేడియం కెపాసిటీ సుమారు 34 వేలుగా చెబుతున్నారు. కాకపోతే న్యూయార్క్ లో దాదాపు 7లక్షల మంది భారత్ సంతతికి చెందినవారు ఉంటే, పాక్ దేశస్తులు లక్ష మంది వరకు ఉన్నారు.
ఇంకా మ్యాచ్ చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారున్నారు. మరి వీరందరూ ఎక్కడ కూర్చుని మ్యాచ్ చూస్తారనే అనుమానాలున్నాయి. లేకపోతే డిమాండ్ ను బట్టి మరో వేదిక నిర్వహిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
టీ 20 వరల్డ్ కప్ లో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఆడతారనే వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే సెలక్షన్ కమిటీ సౌతాఫ్రికా వెళ్లింది. వీరిద్దరిని ఆడేలా ఒప్పిస్తారని అంటున్నారు. అయితే వీరు కూడా సుముఖంగానే ఉన్నారని చెబుతున్నారు.